ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే (CM Eknath Shinde) తనను క్రిమినల్గా మార్చాడని బీజేపీ ఎమ్మెల్యే గణ్పత్ గైక్వాడ్ (MLA Ganpat Gaikwad) ఆగ్రహం వ్యక్తంచేశారు. భూ వివాదంలో పోలీస్ స్టేషన్లోనే షిండే వర్గం శివసేన నేత మహేశ్ గైక్వాడ్పై (Mahesh Gaikwad) ఎమ్మెల్యే గణ్పత్ కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. అయితే తీవ్రంగా గాయపడిన మహేశ్ను హాస్పిటల్కు తరలించిన పోలీసులు ఎమ్మెల్యేను అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఆయన ఓ మీడియా సంస్థతో టెలీఫోన్లో మాట్లాడారు. పోలీసు స్టేషన్లో తన కొడుకును కొట్టారని, తన భూమిని బలవంతంగా గుంజుకున్నారని చెప్పారు. ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగినట్లయితే ఇలాగే నేరగాళ్ల సంఖ్య పెరుగుతూనే ఉంటుందన్నారు. అతడు తనలాంటి మంచి వ్యక్తిని నేడు క్రిమినల్గా (Criminal) చేశాడని ఆరోపించారు.
ఫ్రస్టేషన్లోనే కాల్పులు జరిపానని, అందుకు తనకేమీ పశ్చాత్తాపం లేదన్నారు. పోలీస్ స్టేషన్లో కొందరు నా ఎదుటే నా కుమారుడిని కొట్టారు, ఇంతకంటే నేనేం చేయాలి అని ప్రశ్నించారు. వారిని చంపాలనేది తన ఉద్దేశం కాదని చెప్పారు. కాగా, మహేశ్ గైక్వాడ్పై ఐదు రౌండ్ల కాల్పులు జరిగాయని వార్తలు వచ్చాయి. కానీ పది రౌడ్ల బుల్లెట్లు అక్కడ లభించాయని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.