బెంగళూర్ : కరోనా పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో రాత్రి తొమ్మిది గంటల నుంచి తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకూ నైట్ కర్ఫ్యూ అమలవుతుందని కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై శుక్రవారం ప్రకటించారు. మహారాష్ట్ర, కేరళలో కొవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇరు రాష్ట్రాల సరిహద్దు జిల్లాల్లో వారాంతపు కర్ఫ్యూ విధిస్తామని చెప్పారు. కొవిడ్ టాస్క్ ఫోర్స్తో సమావేశానంతరం తాజా మార్గదర్శకాలను సీఎం విడుదల చేశారు.
విద్యాసంస్ధలను దశలవారీగా తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని ఆయన తెలిపారు. స్కూళ్లు, కాలేజీలను రోజు విడిచి రోజు తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చిందని అధికారులు వెల్లడించారు. మరోవైపు కర్నాటకలో తాజాగా 1785 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా మహమ్మారి బారినపడి 25 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా మరణాలతో కర్నాటకలో కొవిడ్-19 మృతుల సంఖ్య 36,705కు ఎగబాకింది.