రాయ్పూర్, జూలై 22: దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో అంతరించిపోయే దశలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, తన చేతిలో ఉన్న ఒకటి రెండు రాష్ర్టాలను కూడా పోగొట్టుకొనే సూచనలు కనిపిస్తున్నాయి. 2018లో నాలుగింట మూడొంతుల మెజారిటీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన ఛత్తీస్గఢ్లో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ క్షణమైనా ముక్కలయ్యే దశకు చేరుకొన్నది. ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్, సీనియర్ మంత్రి సింగ్దేవ్ మధ్య వైరం అక్కడి ప్రభుత్వాన్ని సంక్షోభంలోకి నడిపిస్తున్నది. ఇదే అదనుగా ప్రతిపక్ష బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు పావులు కదుపుతున్నది. బుధవారం ప్రారంభమైన రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో బఘేల్ ప్రభుత్వంపై అవిశ్వాస నోటీసు ఇచ్చింది.
నిత్యం కుమ్ములాటలే..
ఛత్తీస్గఢ్లో 2018లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీని బఘేల్, సింగ్దేవ్ ముందుండి నడిపించారు. ఆ సమయంలో వీరిద్దని పార్టీ శ్రేణులు, ప్రజలు ‘జై వీరు’లుగా పిలుచుకొనేవారు. 90 సీట్లున్న అసెంబ్లీలో 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 71 స్థానాల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఆ సమయంలో ముఖ్యమంత్రి పదవిలో బఘేల్, సింగ్దేవ్ చెరో రెండున్నరేండ్లు కొనసాగాలని ఒప్పందం కుదిరిందని సింగ్దేవ్ వర్గం చెప్తుండగా, అలాంటిదేమీ లేదని బఘేల్ వర్గం చెప్తున్నది.
మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్పై పట్టుకోసం సీఎం బఘేల్ ఎత్తులు వేస్తూ సింగ్దేవ్ను ఇబ్బందులు పెడుతున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే సింగ్దేవ్ ఈ నెల 7న బఘేల్కు లేఖ రాస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రిపై తాను విశ్వాసం కోల్పోయానని ప్రకటించారు. తాను నిర్వహిస్తున్న నాలుగు శాఖల్లో ఒకదానిని వదులుకొంటున్నానని ప్రకటించారు. దీంతో పార్టీలో సంక్షోభం తారాస్థాయికి చేరింది. ఈ వివాదం ఢిల్లీ వరకు వెళ్లినప్పటికీ కాంగ్రెస్ అధిష్ఠానం ఎలాంటి పరిష్కారం చూపకుండా మౌనం వహించటం రాష్ట్ర పార్టీలో మరింత గందరగోళం మొదలయ్యింది.
లుకలుకలు బయటపడగానే..
అధికార కాంగ్రెస్లో లుకలుకలు ఎప్పుడు బయటపడుతాయో.. అని ఎదురుచూస్తున్న కమలదళానికి బఘేల్, సింగ్దేవ్ వైరం ఒక ఆయుధంగా దొరికింది. దీంతో అసెంబ్లీలో బఘేల్ ప్రభుత్వంపై బీజేపీ బుధవారం అవిశ్వాస నోటీసు ఇచ్చింది. సింగ్దేవ్ను తమవైపు తిప్పుకొని ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కమలదళం తెరవెనుక పావులు కదుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ‘వందేండ్ల చరిత్ర ఉన్న పార్టీకి చెందిన ప్రభుత్వం ఛత్తీస్గఢ్లో కూలడానికి సిద్ధంగా ఉంది. పంజాబ్లో పట్టిన గతే.. ఇక్కడా పడుతుంది’ అని సింగ్దేవ్ రాజీనామా అనంతరం.. బీజేపీ నేత అమిత్ మాలవీయ ట్వీట్ చేయడం గమనార్హం.
మెజారిటీ లేకున్నా.. అధికారంలోకి!
కేంద్రదర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ విపక్షాల ఎమ్మెల్యేలను భయాందోళనలకు గురిచేయడం, సొంత పార్టీ మీదికే వారిని ఉసిగొల్పడం.. ప్రత్యర్థి పార్టీల ప్రభుత్వాలను కూల్చడానికి బీజేపీ అనుసరించే విధానమిది. ఇలా తమ పాచిక పారగానే.. రెబల్స్, స్వతంత్రులు, ఇతర చిన్న పార్టీల మద్దతుతో అధికారంలోకి రావడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య. ప్రభుత్వ ఏర్పాటుకు కనీస మెజారిటీ లేకపోయినా.. అధికారంలోకి రావడం కమలదళానికి కొత్తేంకాదు. ప్రధానిగా మోదీ పగ్గాలు చేపట్టిన 2014 నుంచి మధ్యప్రదేశ్, కర్ణాటక, మేఘాలయ, మణిపూర్, గోవా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, పుదుచ్చేరితో పాటు ఇటీవల మహారాష్ట్రలోనూ ఇదే విధానాన్ని ఆ పార్టీ అనుసరించింది. తాజాగా ఛత్తీస్గఢ్లో ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్, సీనియర్ మంత్రి సింగ్దేవ్ మధ్య వైరం బీజేపీకి ఒక అవకాశంగా మారవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.