యూపీ సీఎం యోగి అదిత్యనాథ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయోధ్య లేదా మధుర నుంచి పోటీచేస్తారని నిన్నటి వరకు భారీయెత్తున ప్రచారం జరిగింది. ముఖ్యంగా అయోధ్య నుంచే యోగి ఖచ్చితంగా బరిలోకి దిగే అవకాశం ఉన్నదని ఆ పార్టీ వర్గాలు చెప్పుకొచ్చాయి. ఆయోధ్యలో ప్రచారం, అభివృద్ధి కార్యక్రమాలు కూడా అందుకు అనుగుణంగానే సాగాయి. అయితే అకస్మాత్తుగా ఆయన పోటీచేయనున్న నియోజకవర్గం అటు మధుర కాకుండా, ఇటు ఆయోధ్య కాకుండా తూర్పు యూపీ(పూర్వాంచల్)లోని గోరఖ్పూర్ అర్బన్ స్థానానికి మారింది. ఈ మేరకు బీజేపీ శనివారం విడుదల చేసిన ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాలో వెల్లడించింది. అయితే ఇప్పటి వరకు జరిగిన ప్రచారాన్ని కాదంటూ యోగిని గోరఖ్పూర్ అర్బన్ నుంచి పోటీచేయించడానికి గల కారణాలపై రాజకీయవేత్తలు పలు విశ్లేషణలు చేస్తున్నారు. అవేమిటంటే..
ఇటీవల బీజేపీకి గుడ్బై చెప్పి ఎస్పీలో చేరిన ముగ్గురు మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు సీనియర్ నేతల్లో ఎక్కువ మంది పూర్వాంచల్ ప్రాంతానికి చెందినవారే. దీంతో వీరి ప్రభావం కుషీనగర్, ప్రతాప్గఢ్, కాన్పూర్ దేహట్ వంటి 17 జిల్లాలపై భారీగా ఉండే అవకాశం ఉన్నది. యూపీ ఎన్నికల్లో విజయం సాధించాలంటే పూర్వాంచల్లో ఎక్కువ మొత్తంలో సీట్లు గెలుచుకోవడం అవసరం. యోగికి ఎసరు పెట్టాలనే ప్లాన్లో ఇప్పటికే ఉన్న ప్రధాని మోదీ.. ప్రస్తుతానికి ఆ ఆలోచనను విరమించుకొన్నట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సీనియర్ నేతలు ఇటీవల బీజేపీని వీడి ఎస్పీలో చేరడమే దానికి కారణంగా పేర్కొంటున్నారు. యోగిని పక్కన పెట్టడం కంటే పూర్వాంచల్లో బీజేపీని కాపాడుకోవాలని మోదీ ప్రాధాన్యంగా చెబుతున్నారు. ఇందులో భాగంగా పూర్వాంచల్లోని గోరఖ్పూర్ నుంచి యోగిని నిలబెడుతున్నారు. అందుకే ఆయన్ని ఆఖరి నిమిషంలో ఈ స్థానానికి మార్చారు. అధిక స్థానాల్లో గెలిస్తే పూర్వాంచల్లో పార్టీ ప్రభావాన్ని నిలబెట్టుకున్నట్టు అవుతుందని మోదీ వ్యూహంగా చెబుతున్నారు. ఒకవేళ అలా జరగకుండా దెబ్బతింటే ఆ నెపాన్ని యోగిపై నెట్టాలనే యోచనలో ప్రధాని ఉన్నారని, ఇందులో భాగంగానే ఈ వ్యూహం పన్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గోరఖ్పూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి యోగి వరుసగా ఐదుసార్లు ఎంపీగా గెలుపొందారు.
ఆ ప్రభావం పడకుండా చూసుకోవడం ఛాలెంజ్
తాజాగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఇచ్చిన ఝలక్తో బీజేపీ కండ్లు బైర్లు కమ్మినట్లయింది. యోగి క్యాబినెట్ నుంచి బయటకు వచ్చిన స్వామి ప్రసాద్ మౌర్య, దారా సింగ్ చౌహాన్, ధరం సింగ్ సైనీ ముగ్గురూ కూడా ఓబీసీ కమ్యూనిటీకి చెందిన వారు. వీరితో పాటు పూర్వాంచల్కి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు బీజేపీని వీడి అఖిలేశ్ నేతృత్వంలోని ఎస్పీలో చేరారు. ఈ ప్రభావం పూర్వాంచల్ ప్రాంతంలో బీజేపీ పాపులారిటీపై పడకుండా చూసుకోవడం ఆ పార్టీకి ఇప్పడు ఛాలెంజ్గా మారింది. ఓబీసీ, దళిత వర్గాల్లో బీజేపీపై వ్యతిరేకత పెరగడం వల్లే ఎస్పీలోకి చేరికలు జరుగుతున్నాయనేది విశ్లేషకుల అభిప్రాయం. పార్టీకి సీనియర్ నేతలు ఇచ్చిన షాక్తో పాటు ఈ వ్యతిరేకత నుంచి నెగ్గుకురావడం కష్టంగానే కనిపిస్తున్నదని పేర్కొంటున్నారు.
107 మందితో బీజేపీ తొలి జాబితా
107 మంది పేర్లతో బీజేపీ యూపీ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాను శనివారం విడుదల చేసింది. 20 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ హ్యాండివ్వగా, సీఎం యోగి అదిత్యనాథ్ గోరఖ్పూర్ అర్బన్ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతే వారిని తప్పించడానికి కారణంగా కనిపిస్తుందని విశ్లేషకులు చెప్తున్నారు.
బీజేపీవాళ్లకు చోటు లేదు
బీజేపీ నుంచి వచ్చే ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఎస్పీలో ఇకపై చోటు లేదని ఆ పార్టీ చీఫ్ అఖిలేశ్ అన్నారు. శనివారం ఉదయం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు రోజే ఆయన బీజేపీ నుంచి వచ్చిన స్వామి ప్రసాద్ మౌర్య సహా ఏడుగురు నేతలను పార్టీలో చేర్చుకొన్నారు.
బీజేపీలోకి ములాయం చిన్న కోడలు!
సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడైన ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణా యాదవ్ బీజేపీలో చేరే అవకాశాలున్నాయి. ప్రస్తుతం బీజేపీ, అపర్ణ మధ్య చర్చలు జరుగుతున్నాయి. ములాయంసింగ్ కుటుంబంలో కలహాలు చాలా రోజుల నుంచే ఉన్నాయి. ములాయం, ఆయన కొడుకు అఖిలేశ్ విధానాలను అపర్ణ తరుచుగా వివర్శించేవారు. రామ మందిరం, జాతీయ పౌర నమోదు (ఎన్నార్సీ) విషయంలో సమాజ్వాదీ పార్టీ అవలంబిస్తున్న విధానాలను ఆమె వ్యతిరేకించేవారు. 2017లో ఎస్పీ నుంచి పోటీ చేసిన అపర్ణ బీజేపీ అభ్యర్థి రీటా బహుగుణ చేతిలో ఓడిపోయారు. ఎస్పీ నుంచి సరైన మద్దతు లేకపోవడం వల్లే ఓడిపోయానని అపర్ణ మనసులో పెట్టుకున్నారు.