Amarnath Yatra | జమ్ము కశ్మీర్లోని అమర్నాథ్ యాత్ర మార్గంలో కుంభవృష్టి కురుస్తుండటంతో గుహ పరిసరాల్లోకి భారీ వరద పోటెత్తింది. వరద వల్ల అక్కడ ఏర్పాటు చేసిన గుడారాలు కొట్టుకుపోయాయి. భారీగా వరద పోటెత్తడంతో యాత్రికులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్షా రంగంలోకి దిగారు. కేంద్ర, జమ్ముకశ్మీర్ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
తాజా పరిస్థితిపై జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో అమిత్ షా మాట్లాడారు. సహాయ చర్యలు వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రధాని నరేంద్రమోదీ కూడా అధికారులతో సంప్రదించి సహాయ చర్యలు ముమ్మరంచేయాలని ఆదేశించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఐటీబీపీ జవాన్లు సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు.
ఒక్కసారిగా వరద పోటెత్తడంతో 10 మంది యాత్రికులు మృత్యువాత పడ్డారు. మరో 40 మంది ఆచూకీ గల్లంతైనట్లు తెలుస్తున్నది. ఈ అమర్నాథ్ యాత్రలో తెలంగాణలోని గోషామహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా ఉన్నారు. కరోనా మహమ్మారి ఉధృతి వల్ల గత రెండేండ్లుగా అమర్నాథ్ యాత్ర జరుగలేదు. రెండేండ్ల విరామం తర్వాత అమర్నాథ్ యాత్ర ఈ ఏడాది చేపట్టారు.