దుబాయ్: వాతావరణ మార్పులపై దుబాయ్లో సమావేశం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ (WMO Report) ఓ నివేదికను రిలీజ్ చేసింది. గత దశాబ్ధం అంటే 2011 నుంచి 2020 వరకు.. ఇండియాలో వాతావరణ మార్పులు ప్రభావం ఉన్నట్లు రిపోర్టులో తెలిపారు. కొన్నేళ్లు వర్షాలు, కొన్నేళ్లు ఎండలు దంచికొట్టినట్లు ఆ నివేదికలో వెల్లడించారు. ఇప్పటి వరకు ఉన్న రికార్డుల ప్రకారం.. గత దశాబ్ధంలో అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు తేలింది. కాప్28 సమావేశంలోనూ ఈ విషయాన్ని వెల్లడించిన విషయం తెలిసిందే.
గత ఏడాది వాయవ్య భారత్, పాకిస్థాన్, చైనా, అరేబియా దీవుల్లోని దక్షిణ భాగాల్లో తడి వాతావరణ పరిస్థితులు నెలకొన్నట్లు డబ్ల్యూఎంవో తన నివేదికలో పేర్కొన్నది. ఈ ప్రదేశాల్లో వెట్ డికేడ్ నమోదు అయినట్లు చెప్పింది. ఇక 2011 నుంచి 2020 వరకు.. వేడి వాతావరణం కూడా అధికంగానే నమోదు అయ్యింది. 1961 నుంచి 1990 వరకు పోలిస్తే.. ఈశాన్య ఆసియా, యూరోప్, దక్షిణ ఆఫ్రికా, మెక్సికో, ఆస్ట్రేలియా దేశాల్లో మాత్రం వేడి వాతావరణం రెట్టింపు అయినట్లు తెలుస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా టెంపరేచర్లు పెరగడంతో.. అతిశీతల వాతావరణ పరిస్థితులు లేకుండాపోయినట్లు తెలుస్తోంది. అతిశీతల రాత్రులు గత దశాబ్ధంలో.. 1961-90తో పోలిస్తే 40 శాతం పడిపోయినట్లు రిపోర్టులో వెల్లడించారు. భారత్లో రుతుపవనాల వల్ల తీవ్ర నష్టం 2013లో జరిగినట్లు పేర్కొన్నారు. ఆ సంవత్సరం కురిసిన వర్షాల వల్ల హిమాలయ ప్రాంతాల్లో తీవ్ర వరదలు వచ్చాయన్నారు. వర్షాలు, మంచుచరియలు కరిగిపోవడం వల్ల ఫ్లడ్స్ వచ్చాయి. ఇక 2018, 2019, 2020లో వచ్చిన వరదల వల్ల కేరళలో తీవ్ర నష్టం జరిగింది.
2011 నుంచి 2020 వరకు ఇండియాలో కరువు కూడా నమోదు అయ్యింది. 2011లో సుమారు 28 రాష్ట్రాల్లో కరువును ప్రకటించారు. దీంతో తీవ్ర ఆహార, నీటి కొరత ఏర్పడింది. పంటలు ఎండిపోవడం వల్ల ఆ సమయంలో ప్రజలు ఎక్కువ శాతం ప్రభుత్వ ఆహార సరఫరా(పీడీఎస్) వ్యవస్థపై ఆధారపడ్డారు.కరువు ప్రాంతాల్లో సుమారు 82 శాతం ఇండ్లల్లో ఆహార అభద్రత ఏర్పడినట్లు రిపోర్టులో తెలిపారు.
2001-2010 దశాబ్ధంతో పోలిస్తే 2011-2020 మధ్య కాలంలో అంటార్కిటికాలో 75 శాతం మంచు గడ్డలు కరిగిపోయాయి. గత దశాబ్ధంలో చాలా వరకు దేశాల్లో అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు డబ్ల్యూఎంవో సెక్రటరీ జనరల్ పెట్టరి తలాస్ తెలిపారు. సముద్రాల్లో వేడి విపరీతంగా పెరుగుతోందని, సముద్ర నీటి మట్టం కూడా ఊహించని వేగంతో పెరుగుతున్నట్లు డబ్ల్యూఎంవో తెలిపింది. హీట్వేవ్స్ వల్ల అత్యధిక సంఖ్యలో గత దశాబ్ధంలో మరణాలు రిపోర్టు అయ్యాయి.