ముంబై, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): బీజేపీ పాలిత మహారాష్ట్రలో పదో తరగతి బోర్డు పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. బీడ్ జిల్లాలోని కుర్లాలోని పరీక్షా కేంద్రంలో విద్యార్థులు గుడారంలో కూర్చొని పరీక్ష రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పరీక్షా కేంద్రంగా ఉన్న పాఠశాలలోని గదుల్లో సెంటర్కు కేటాయించిన విద్యార్థుల సంఖ్య సరిపోని పరిస్థితి ఉండటంతో వారి కోసం పాఠశాల గ్రౌండ్లో టెంట్ ఏర్పాటు చేసి, అందులో బెంచీలు వేసి పరీక్ష రాయించాలని అధికారులు నిర్ణయించారు.
అయితే పెరుగుతున్న ఎండల కారణంగా తమ పిల్లలు సరిగ్గా పరీక్షలు రాయలేరని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు సరిపడా గదులు లేకపోతే వారికి వేరే కేంద్రానికి కేటాయించాలే తప్ప ఇలా టెంట్లో పరీక్షలు రాయించడమేమిటని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్టు చెప్పారు.