కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్లో (Murshidabad) తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. ముర్షిదాబాద్ జిల్లా రెజినగర్లోని శక్తిపూర్ ప్రాంతంలో శ్రీరామనవమి (Sri Ram Navami) ఊరేగింపు సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. శోభాయత్ర నిర్వహిస్తున్నవారిపై పలువురు రాళ్లతో దాడిచేశారు. దీంతో 18 మంది గాయపడ్డారు. వారిలో ఇద్దరు మైనర్లతోపాటు పలువురు పోలీసులు కూడా ఉన్నారు. దుండగుల దాడిలో పెద్ద సంఖ్యలు షాపులు ధ్వంసమయ్యాయి. పరిస్థితి చేయిదాటిపోతుండటంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. భాష్పవాయు గోళాలు ప్రయోగించి ఇరువార్గాల వారిని చెదరగొట్టారు. ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. అధనపు బలగాలను మోహరించారు. శోభాయాత్రపై కొందరు వ్యక్తులు భవనాలపై నుంచి రాళ్లు విసురుతున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
కాగా, శోభాయత్రపై దాడి ఘటనను బీజేపీ నాయకుడు, ప్రతిపక్ష నేత సువేందు అధికారి తీవ్రంగా ఖండించారు. సీఎం మమతా బెనర్జీపై ఆగ్రహం వ్యక్తంచేశారు. శాంతియుతంగా సాగుతున్న రామ నవమి ఉత్సవంపై శక్తిపూర్లో దుండగులు దాడిచేశారని, మమత పోలీసులు వారితో కలిసి రామ భక్తులపై లాఠీ చార్జ్ చేశారని, టియర్ గ్యాస్ ప్రయోగించారని ఆరోపించారు. మమత పోలీసుల నిర్లక్ష్యంతో గతేడాది దల్ఖోలా, రిష్రా, సెరంపోర్లో ఇలాంటి ఘటనలే చోటుచేసుకున్నాయని చెప్పారు. రాభ భక్తులను రక్షించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తంచేశారు.