ఇంఫాల్, ఆగస్టు 3: మూడు నెలలుగా అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్లో మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. తాజాగా బుధవారం చురాచాంద్పూర్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులు, ఆర్మీకి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బలగాలు టియర్ గ్యాస్ షెల్స్ను ప్రయోగించడంతో 17 మంది గాయపడ్డారు. తొలుత మణిపూర్ హింసాకాండలో అసువులుబాసిన 35 మంది కుకీల మృతదేహాలను సామూహిక ఖననం చేసేందుకు స్వదేశీ గిరిజన నాయకుల ఫోరం (ఐటీఎల్ఎఫ్) ప్రయత్నించగా.. వారి ప్రయత్నాలను హైకోర్టు అడ్డుకుంది. ఎక్కువ మంది ఒకేచోట చేరితే మళ్లీ ఘర్షణలు తలెత్తే ప్రమాదం ఉందని, యథాతధ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది.
మరోవైపు హవోలాయి ఖోపి గ్రామంలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. కాంగ్వాయ్, ఫౌగక్చావో గ్రామాలకు చెందిన వందల మంది ఆందోళన కారులు సామూహిక ఖననానికి వెళ్లేందుకు విఫలయత్నం చేశారు. ఆందోళనకారులు, ఆర్ఏఎఫ్ బలగాలను అడ్డగించేందుకు వారు ప్రయత్నించారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. కుకీలు ఎంతకీ వెనక్కితగ్గకపోవడంతో టియర్ గ్యాస్ షెల్స్ను ఆర్మీ ప్రయోగించింది. దీంతో 17 మంది గాయపడ్డారు.
ఉదయం ఆరు గంటలకే హైకోర్టులో విచారణ
రాష్ట్రంలో నెలకొన్న అత్యవసర పరిస్థితిపై మణిపూర్ హైకోర్టు విచారణ జరిపింది. ఉదయం ఆరు గంటలకే దీనిపై తాత్కాలిక చీఫ్ జస్టిస్ ఎంవీ మురళీధరన్ నేతృత్వంలోని ధర్మాసనం అత్యవసర విచారణ చేసింది. సామూహిక ఖననం చేసేందుకు నిరాకరించిన హైకోర్టు.. యథాతధ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. శాంతిభద్రతలు నెలకొల్పాలని ప్రభుత్వాలను ఆదేశించింది.