లక్నో : ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ నేతలు తమ వాగ్ధాటిని పెంచుతున్నారు. ఎన్నికల్లో అధికారం మాదేనంటూ ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజా భీమ్ ఆర్మీ చీఫ్ నేత చంద్రశేఖర్ ఆజాద్ ఎన్నికల్లో గెలిస్తే.. తానే ముఖ్యమంత్రిని కావొచ్చన్నారు. సోమవారం ఆయన ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 403 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అన్ని వర్గాలను నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు.
నాయకులు లేకున్నా.. ప్రజలంతా మద్దతిస్తున్నారన్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం యోగి ఆదిత్యనాథ్ పోటీ చేయనున్న స్థానం నుంచే పోటీ చేస్తానని చంద్రశేఖర్ ఆజాద్ ప్రకటించారు. ప్రసుతం యూపీ సీఎంగా ఉన్న యోగి తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నారు. 2017లో సీఎం అయ్యే వరకు ఆయన లోక్సభ సభ్యుడి ఉన్నారు. తొలిసారిగా 1998లో గోరఖ్పూర్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. గోరఖ్పూర్ నుంచి వరుసగా 5సార్లు లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శాసనమండలి ద్వారా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.