న్యూఢిల్లీ: సెప్టెంబర్ 5వ తేదీన చేపట్టనున్న నిరసన ప్రదర్శనను రద్దు చేసినట్లు సీజేపీ నేత సౌరవ్ దాస్ వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన సుప్రీంకోర్టు(Supreme Court)కు చెప్పారు. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ముందు ఆయన తన స్టేట్మెంట్ చదివారు. జూలై నెలలో సీజేపీ నేతలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొనడం వల్ల ఆందోళన విరమిస్తున్నట్లు చెప్పారు. నీట్ యూజీతో పాటు ఇతర పరీక్షల్లో అక్రమాలు జరిగినట్లు సుమారు 36 రోజుల పాటు సీజేపీ కార్యకర్తలు దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.
నిరసనకారులపై నమోదు అయిన కేసులను రద్దు చేసేందుకు మహారాష్ట్ర, బీహార్, వెస్ట్ బెంగాల్, అస్సాంతో పాటు కేంద్రం కూడా సిద్ధంగా ఉన్నట్లు మెహతా కోర్టుకు చెప్పారు. అయితే హేయమైన నేరాల్లో ఇప్పటికే పేర్లు ఉన్న వారిని మాత్రం వదిలేది లేదన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద సుప్రీంకోర్టు తన అసాధారణ అధికారాలను వాడుకుని నిరసనకారులపై కేసులను ఎత్తివేయాలని సొలిసిటర్ జనరల్ కోరారు.