CJI Sanjiv Khanna : పదవీ విరమణ తర్వాత తాను ఎలాంటి అధికారిక పదవులు చేపట్టబోనని భారత ప్రధాన న్యాయమూర్తి (Chief Justice of India) జస్టిస్ సంజీవ్ ఖన్నా (Sanjiv Khanna) అన్నారు. తాను న్యాయవ్యవస్థలోనే ఏదైనా చేయాలని అనుకుంటున్నానని చెప్పారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సంజీవ్ ఖన్నా పదవీకాలం మంగళవారంతో ముగిసింది. దాంతో తన ఆఖరి రోజు కోర్టు (Supreme Court) లో బెంచ్ కార్యలాపాలు ముగియగానే సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కాగా జస్టిస్ సంజీవ్ ఖన్నా గతేడాది నవంబర్ 11న భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. జస్టిస్ సంజీవ్ ఖన్నాకు మాజీ న్యాయమూర్తి, దివంగత జస్టిస్ హెచ్ఆర్ ఖన్నా సమీప బంధువు. 2005లో ఢిల్లీ హైకోర్టు అదనపు జడ్జిగా నియమితులైన సంజీవ్ ఖన్నా ఆ మరుసటి ఏడాది శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2019 జనవరి 18న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, 2024 నవంబర్ 11న సీజేఐగా బాధ్యతలు చేపట్టారు.
సంజీవ్ ఖన్నా పదవీ విరమణతో భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ (BR Gavai) బాధ్యతలు చేపట్టనున్నారు. మే 14న ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నూతన సీజేఐతో ప్రమాణస్వీకారం చేయిస్తారు. సీనియారిటీపరంగా తన తర్వాత స్థానంలో ఉన్న జస్టిస్ గవాయ్ పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా గతంలోనే సిఫారసు చేయడంతో కేంద్రం ఆమోదం తెలిపింది. జస్టిస్ గవాయ్ పదవీకాలం నవంబర్ 23న ముగియనుంది.