న్యూఢిల్లీ: సీనియర్ న్యాయవాది కర్నాటి రామ్మోహన్రావు మృతిపట్ల భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సంతాపం వ్యక్తం చేశారు. 1967లో న్యాయవాద వృత్తిని ప్రారంభించి దాదాపు 54 ఏండ్లపాటు న్యాయ, సామాజిక సేవలో కర్నాటి నిమగ్నమయ్యారని కొనియాడారు. ప్రగతిశీల భావాలతో.. పౌరహక్కుల రక్షణ కోసం కర్నాటి అవిశ్రాంత పోరాటం సాగించారని, ఎక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరిగినా.. గళాన్ని వినిపించి బాధితులకు అండగా నిలిచి తన విలక్షణ వ్యక్తిత్వాన్ని చాటుకున్నారని జస్టిస్ రమణ శ్లాఘించారు. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టు ధర్మాసనం విజయవాడలో ఏర్పాటు చేయాలని, తద్వారా అందరికీ న్యాయం అందుబాటులోకి తేవాలని కర్నాటి చేసిన ప్రయత్నాలు, పడిన తపన మరువలేమన్నారు. కర్నాటి ఆదివారం కన్నుమూశారు.