CJI DY Chandrachud : సంపూర్ణ జీవనశైలితో ఆరోగ్యంగా ఉండటమే కాకుండా రోజంతా ఉత్తేజంగా, సానుకూల శక్తితో ఉరకలు వేయవచ్చని ప్రపంచవ్యాప్తంగా నిపుణులు నిత్యం చెబుతుంటారు. సంపూర్ణ జీవనశైలిని అనుసరించడం పట్ల భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఆసక్తి కనబరుస్తుంటారు. ఆయన ఇటీవల ఓ వార్తఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన దైనందిన జీవితం, ఆహార నియమాలు, చీట్ మీల్స్ సహా పలు అంశాలను వెల్లడించారు.
తన దినచర్య ప్రతిరోజూ తెల్లవారుజామున 3.30 గంటలకు యోగాతో ఆరంభమవుతుందని చెప్పారు. ఆపై ఆయుర్వేద ఆహార పద్ధతులను అనుసరిస్తానని తెలిపారు. ఇక ఆహార ప్రాధాన్యతల విషయానికి వస్తే తాను, తన భార్య శాకాహారం తీసుకుంటామని వివరించారు. మనం నాలికకు ఏం అందిస్తామనేది మన శరీరం, మనసును నిర్ధేశిస్తుందని తాను నమ్ముతానని, అందుకే మొక్కల ఆధారిత ఆహారం, జీవనశైలి తనకు సరిపడుతుందని చెప్పారు.
ప్రతి మరాఠీ కుటుంబం కిచెన్లో సగ్గుబియ్యం తప్పనిసరిగా ఉంటుంది. అయితే తాను సగ్గుబియ్యానికి బదులు రాజ్గిరాను తీసుకోవడానికి ఇష్టపడతానని తెలిపారు. ఇది తేలికగా ఉండటంతో పాటు ఆరోగ్యకరమైన తృణధాన్యాల్లో ఒకటని చెప్పారు. అయితే తాను అడపాదడపా ఐస్క్రీం విషయంలో రాజీపడుతుంటానని తెలిపారు. మీరు మీ మనసును అదుపులో ఉంచుకుంటే అంతా సజావుగా ఉంటుందని ముగించారు.
Read More :