న్యూఢిల్లీ, జనవరి 28: న్యాయ వ్యవస్థలో వాయిదాల సంస్కృతి పోయి.. వృత్తి నైపుణ్యంతో (ప్రొఫెషనలిజం) కూడిన సంస్కృతి రావాల్సిన అవసరముందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ అన్నారు. సంస్థాగత మార్పులపై చర్చలు జరగాల్సిన అవసరముందన్నారు.
భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 75వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన వేళ, సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు. కోర్టుల పనితీరు, విచారణ ప్రాచీన పద్ధతుల్లో ఉండటం.. మొదలైనవి సవాళ్లుగా గుర్తించామని, వీటిపై చర్చిస్తున్నామని ఆయన తెలిపారు. దీని కంటే ముందు సుప్రీంకోర్టు వజ్రోత్సవ వేడుకలు ప్రధాని మోదీ చేతులమీదుగా ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కొత్త వెబ్సైట్ను ప్రధాని మోదీ ప్రారంభించారు. దీంతో దేశ పౌరులకు సుప్రీంకోర్టు డిజిటల్ నివేదికలు, తీర్పులు అందుబాటులోకి రానున్నాయి. 1950 జనవరి 26 నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి రాగా, అదే ఏడాది జనవరి 28 నుంచి దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రారంభమైంది. అప్పట్నుంచి దేశంలో ప్రాథమిక హక్కులను కాపాడటంలో సుప్రీం కీలకపాత్ర పోషిస్తున్నది. రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న చట్టాలను సైతం సుప్రీంకోర్టు సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే.
ఈజ్ ఆఫ్ జస్టిస్ పౌరుల హక్కు: ప్రధాని మోదీ
దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కొత్త చట్టాలు చేస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ లివింగ్.. మాదిరి ఈజ్ ఆఫ్ జస్టిస్ (సులభతర న్యాయం) అన్నది ఈ దేశానికి చాలా అవసరమని ప్రధాని అన్నారు. ఈజ్ ఆఫ్ జస్టిస్ పొందటం దేశంలోని ప్రతి పౌరుడి హక్కుగా ప్రధాని పేర్కొన్నారు. ‘భారత ప్రజాస్వామ్యాన్ని సుప్రీంకోర్టు బలోపేతం చేసింది. సామాజికంగా, రాజకీయంగా దేశానికి కొత్త దిశా నిర్దేశం చేసింది. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా కొత్త చట్టాలు చేస్తున్నాం’ అని అన్నారు. సుప్రీంకోర్టు భవనాన్ని మరింత విస్తరించేందుకుగాను రూ.800 కోట్లు ఖర్చు చేయనున్నట్టు చెప్పారు.
పెరిగిన మహిళల ప్రాతినిధ్యం
సుప్రీంకోర్టు వజ్రోత్సవ వేడుకల్ని పురస్కరించుకొని న్యాయవ్యవస్థలోని సమస్యలు, సవాళ్లను సీజేఐ ప్రస్తావించారు. ‘న్యాయ వృత్తిలో సమాజంలోని భిన్నవర్గాల ప్రాతినిధ్యం పెరగాలి. బార్, బెంచ్లలో ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యం తక్కువగా ఉంది. సమాజంలోని అణగారిన వర్గాల చేరికపై దృష్టిపెట్టాలి. జిల్లా కోర్టుల్లో మహిళా ఉద్యోగుల సంఖ్య 36.3శాతముంది’ అని అన్నారు. జడ్జీలు తమ విధుల్ని నిర్వర్తించటంలో వ్యక్తిగతంగానూ స్వతంత్రతను కలిగివుండటం చాలా ముఖ్యమని సీజేఐ పేర్కొన్నారు. వారిపై సామాజికంగా, రాజకీయంగానూ ఒత్తిడి ఉండరాదన్నారు. సరైన సమయానికి తీర్పులు వెలువరించి న్యాయవ్యవస్థ పట్ల నమ్మకాన్ని పెంచాల్సిన బాధ్యత సుప్రీంకోర్టుపై ఉందన్నారు.