న్యూఢిల్లీ: మణిపూర్(Manipur)లో మహిళల్ని నగ్నంగా ఊరేగించిన ఘటనకు చెందిన అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ సాగింది. బాధిత మహిళల తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. అయితే మే 3వ తేదీ నుంచి ఇప్పటి వరకు అలాంటి ఘటనలపై ఎన్ని ఎఫ్ఐఆర్లు నమోదు అయినట్లు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రశ్నించారు. మణిపూర్లో జరిగిన ఘటనకు చెందిన వీడియో ఒక్కటి వెలుగులోకి వచ్చిందని, కానీ మహిళల పట్ల వేధింపులకు చెందిన ఎన్నో ఘటనలకు జరుగుతున్నాయని, ఇదొక్కటే ప్రత్యేకమైన ఘటన కాదు అని, అయితే మహిళల పట్ల జరుగుతున్న వేధింపులను అరికట్టేందుకు చాలా విస్తృత స్థాయిలో చర్యలు చేపట్టాలని, ఇలాంటి అన్ని కేసుల్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని వాదనల సమయంలో డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు.
ఈ కేసులో సీబీఐ విచారణను బాధిత మహిళలు వ్యతిరేకిస్తున్నట్లు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ అన్నారు. ఈ కేసును అస్సాంకు బదిలీ చేయడాన్ని కూడా వాళ్లు వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. అయితే ప్రభుత్వం తరపున ఈ కేసులో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. ఈ కేసును అస్సాంకు బదిలీ చేయాలని తమ ప్రభుత్వం కోరలేదన్నారు. మణిపూర్ బయట ఈ అంశంపై విచారణ సాగాలని చెప్పినట్లు తుషార్ మెహతా పేర్కొన్నారు.
ఇద్దరు బాధిత మహిళల్లో.. ఒకరి తండ్రి, సోదరుడిని హత్య చేసినట్లు కపిల్ సిబల్ ఆరోపించారు. వాళ్లకు చెందిన మృతదేహాలను ఇంకా గుర్తించలేదన్నారు. మే 18వ తేదీన ఈ ఘటనపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యిందన్నారు. సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకున్న తర్వాతే ఆ కేసులో కదలిక వచ్చిందన్నారు. అయితే ఈ ఘటనను వ్యక్తిగత ఏజెన్సీ విచారణ చేపట్టాలని ఆయన సుప్రీంను కోరారు.
ఈ కేసును సుప్రీంకోర్టు మానిటర్ చేస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని తుషార్ మెహతా తెలిపారు. ఇప్పటి వరకు 595 ఎఫ్ఐఆర్లు నమోదు అయినట్లు సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ తెలిపారు. అయితే దీంటో ఎన్ని లైంగిక హింస, హత్యకు చెందినవో స్పష్టంగా తెలియదన్నారు. రేప్ బాధిత మహిళలు మహిళలకు మాత్రమే తమ బాధను చెప్పుకోగలరని, అందుకే హైపవర్ మహిళా కమిటీని ఏర్పాటు చేయాలని ఆమె సుప్రీంను కోరారు. కుక్కీలు కూడా సీబీఐ విచారణను వ్యతిరేకించారు.