CJI Justice Chandrachud | న్యాయవాద వృత్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పిలుపునిచ్చారు. తమిళనాడు మధురైలో జిల్లా సెషన్స్ కోర్టు, చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు శంకుస్థాపన ప్రారంభోత్సవంలో సీజేఐ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాద వృత్తిలో స్త్రీల నిష్పత్తి నిరాశాజనకంగా ఉందన్న ఆయన.. మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలన్నారు.
యువ న్యాయవాదుల రిక్రూట్మెంట్పై ఛాంబర్స్కు అనుమానాలున్నాయని, ప్రభావంతులైన యువతుల కరువు కారణం కాదన్న ఆయన.. మహిళల పట్ల కలిగి ఉన్న మూస పద్ధతుల ఫలితమన్నారు. కుటుంబ బాధ్యతల కారణంగా మహిళలు ఎక్కువ గంటలు పని చేయలేకపోతున్నారని రిక్రూట్మెంట్ ఛాంబర్లు భావిస్తున్నాయని తెలిపారు. పిల్లలను కనడం, వారిన ఆలనాపాలన చూసుకోవడం ఓ ఎంపిక అని, ఈ బాధ్యతలు తీసుకున్నందుకు శిక్షంచకూడదని అందరు మొదట అర్థం చేసుకోవాలన్నారు.
న్యాయవాద వృత్తిలో ప్రవేశించేందుకు తమిళనాడులో 50వేల మంది పురుషులు నమోదు చేసుకోగా.. ఇందులో మహిళలు కేవలం 5వేల మంది మాత్రమే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయని సీజేఐ తెలిపారు. న్యాయవాద వృత్తి మహిళలకు సమాన అవకాశాలు కల్పించడం లేదన్నారు. ఈ గణాంకాలు తమిళనాడులోనే కాదని, దేశవ్యాప్తంగా ఇవే గణాంకాలు ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా మారుతున్న పరిస్థితులపై సైతం ఆయన చర్చించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.