చెన్నై: తమిళనాడులోని కోయంబత్తూర్లో మార్చి 18న ప్రధాని మోదీ నిర్వహించనున్న రోడ్ షోకు పోలీసులు అనుమతి నిరాకరించారు. (PM Modi roadshow) భద్రతాపరమైన కారణాలు, విద్యార్థుల పరీక్షల నేపథ్యంలో జిల్లా పోలీసు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. లోక్సభ ఎన్నికల్లో ప్రచారం కోసం ఈ నెల 18న కోయంబత్తూరు నగరంలోని 3.6 కిలోమీటర్ల మేర ప్రధాని మోదీ రోడ్ షో కోసం బీజేపీ అనుమతి కోరింది. 1998లో వరుస బాంబు పేలుళ్లు జరిగిన కోయంబత్తూరులోని ఆర్ఎస్ పురం కూడా మోదీ రోడ్ షో మార్గంలో ఉంది.
కాగా, మతపరంగా సున్నిత ప్రాంతం కావడంతో ఏ రాజకీయ పార్టీలు లేదా సమూహాలకు కోయంబత్తూరులో రోడ్ షోలకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు. అలాగే మార్చి 18, 19 తేదీల్లో విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు జరుగనున్నాయి. మోదీ రోడ్ షో కోసం ప్రతిపాదించిన మార్గంలో పలు పరీక్షా కేంద్రాలు కూడా ఉన్నాయని అధికారులు తెలిపారు. వీటన్నింటి దృష్ట్యా ప్రధాని మోదీ రోడ్ షోకు అనుమతి నిరాకరించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే మద్రాసు హైకోర్టును బీజేపీ ఆశ్రయించింది. దీంతో ప్రధాని మోదీ రోడ్ షోకు కోర్టు అనుమతించింది.