పాట్నా: లోక్సభ ఎన్నికల్లో హాజీపూర్ స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan) తెలిపారు. ఈ స్థానం నుంచి బాబాయ్ పశుపతి పరాస్తో తలపడే అవకాశం ఉందన్నారు. తనకు వ్యతిరేకంగా పోటీకి దిగాలో వద్దో అన్నది ఆయనే నిర్ణయించుకోవాలని చెప్పారు. బుధవారం చిరాగ్ పాశ్వాన్ తన పార్టీ నేతలతో సమావేశమయ్యారు. బీజేపీతో పొత్తులో భాగంగా ఆయన పార్టీకి కేటాయించిన ఐదు స్థానాల్లో పోటీపై వారితో చర్చించారు.
కాగా, పార్టీ సమావేశం తర్వాత చిరాగ్ పాశ్వాన్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ (ఆర్ఎల్జేపీ) చీఫ్, బాబాయ్ పశుపతి పరాస్ ఎంపీగా ఉన్న హాజీపూర్ స్థానం నుంచి తాను పోటీ చేస్తున్నట్లు తెలిపారు. గతంలో తన తండ్రికి చెందిన ఈ స్థానం నుంచి తనతో పోటీ పడాలో వద్దో ఆయనే నిర్ణయించుకోవాలని అన్నారు. ‘ఎప్పుడూ ప్రధాని మోదీకి అండగా ఉంటానని ఆయన (బాబాయ్) ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఇప్పుడు ఎన్డీయేకు 400 పైగా సీట్లు గెలుపొందాలనే లక్ష్యాన్ని సాధించడానికి నా మార్గానికి అడ్డంకిగా మారాలనుకుంటున్నారో లేదో ఆయనే నిర్ణయించుకోవాలి’ అని అన్నారు.