భారత, చైనా సైనికుల మధ్య2020 సంవత్సరంలో గాల్వాన్ వేదికగా ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణలో భారత్కు చెందిన 20 మంది సైనికులు అమరులయ్యారు. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం ఎలాంటి భేషజాలకు పోకుండా ప్రకటించింది. చైనాకు చెందిన సైనికులు కూడా చాలా మందే మరణించారు. అయినా తమ సైనికులెవ్వరూ మరణించలేదని చైనా ప్రభుత్వం బీరాలు పలికింది. గొప్పలకు పోయింది. చివరికి జరిగిందేమో తెలుసా… ఈ గాల్వాన్ ఘర్షణలో చైనాకు కూడా గట్టి దెబ్బే తగిలిందట. ఈ విషయాన్ని ఆస్ట్రేలియాకు చెందిన క్లాక్సన్ అనే పత్రిక వెల్లడించింది. చైనా ప్రకటించిన సంఖ్య కంటే చాలా ఎక్కువ మందే సైనికులు చనిపోయారని ఈ పరిశోధనలో తేలింది. ఈ గాల్వాన్ ఘర్షణలో చైనాకు చెందిన 38 మంది సైనికులు నదిలో పడి చనిపోయారని ఆ పత్రిక తన పరిశోధనలో స్పష్టం చేసింది.
రాత్రిపూట నది దాటుతున్న సమయంలో అందులో కొట్టుకుపోయారని పేర్కొంది. జూనియర్ సార్జెంట్ వాంగ్ జురాన్ ఈ సందర్భంగా మరణించారని చైనా ధృవీకరించింది. అయితే కల్నల్ ఫాబావో కూడా మరణించారని ఆస్ట్రేలియా మీడియా పేర్కొంది. చైనా మాత్రం ఈ విషయాన్ని ధృవీకరించడం లేదు. ఈ ఘర్షణ సమయంలో వాటర్ ప్యాంట్స్ వేసుకోవడానికి కూడా చైనా సైనికులకు సమయం దొరకలేదు. వాంగ్ మార్గదర్శకత్వంలో ఆ రాత్రి మంచుతో వున్న నదిని దాటడానికే నిశ్చయించుకున్నారు. ఈ సమయంలోనే నది ఉద్ధృతి విపరీతంగా పెరిగిపోయింది. దీంతో వారు ఆ నదిలో కొట్టుకుపోయారు అని ఆస్ట్రేలియా మీడియా పేర్కొంది. ఈ పరిశోధన సమయంలో చైనాకు చెందిన చాలా వెబ్సైట్లు, సోషల్ మీడియా వేదికలు, మీడియా కథనాలు.. ఇలా చాలా వాటిని ఆస్ట్రేలియా బృందం పరిశోధించింది.