న్యూఢిల్లీ : షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) రక్షణ మంత్రుల సమావేశంలో భాగంగా చైనా, రష్యా రక్షణ మంత్రులు భారత్కు రాబోతున్నారు. చైనా రక్షణ మంత్రి లీ షంగ్ఫూ, రష్యా రక్షణ మంత్రి సెర్గెయ్ షోయ్గు భారత్ రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్తో ఈ నెల 27న సమావేశం కానున్నారు. 2020 గల్వాన్ లోయ ఘర్షణ తర్వాత చైనా రక్షణ మంత్రి భారత్లో పర్యటించడం ఇదే ప్రథమం. ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక రష్యా రక్షణ మంత్రి మన దేశానికి రావడం ఇదే మొదటిసారి. వచ్చే నెలలో ఎస్సీవో విదేశాంగ మంత్రుల సమావేశానికి కూడా భారత్ ఆతిథ్యం ఇవ్వనున్నది. ఎస్సీవోలో భారత్తో పాటు చైనా, కజకిస్థాన్, కిర్గిజిస్థాన్, పాకిస్థాన్, రష్యా, ఉజ్బెకిస్థాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి.
చైనాతో భారత్ కమాండర్ స్థాయి చర్చలుభారత్, చైనా మధ్య ఆదివారం కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి. తూర్పు లఢఖ్ సెక్టార్లోని చుసూల్ మోల్డో మీటింగ్ పాయింట్ వద్ద సమావేశాలు నిర్వహించినట్టు రక్షణ వర్గాలు తెలిపాయి. డెప్సంగ్, డెమ్చుక్లో చైనా సైనికులు చొచ్చుకువస్తున్న అంశాన్ని లేవనెత్తినట్టు భారత వర్గాలు తెలిపాయి.