న్యూఢిల్లీ: కొన్ని రోజుల క్రితం అరుణాచల్ ప్రదేశ్కు చెందిన యువకుడు మిరమ్ తారన్ను చైనా అపహరించిన విషయం తెలిసిందే. దీనిపై ఇవాళ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. త్వరలోనే ఆ యువకుడిని చైనా రిలీజ్ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ట్విట్టర్ ద్వారా రియాక్ట్ అయిన మంత్రి.. ఇండియన్ ఆర్మీ, చైనా పీఎల్ఏ మధ్య రిపబ్లిక్ డే సందర్భంగా హాట్లైన్ సంభాషణ జరిగినట్లు చెప్పారు. అరుణాచల్ యువకుడి గురించి చైనాతో చర్చించామని, మిరమ్ను అప్పగించేందుకు డ్రాగన్ అంగీకరించిందని, అయితే రిలీజ్ చేయడానికి సంబంధించిన స్థలాన్ని చెప్పాలని కోరినట్లు మంత్రి తెలిపారు. చైనా దళాలు రిలీజ్కు సంబంధించిన తేదీని వెల్లడించనున్నట్లు మంత్రి చెప్పారు. వాతావరణం సరిగా లేని కారణంగా.. అప్పగింత ఆలస్యం అవుతున్నట్లు ఆయన తెలిపారు.