China | అరుణాచల్ ప్రదేశ్కు చెందిన 17 ఏళ్ల మిరమ్ తారన్ అనే బాలుడ్ని చైనా సైన్యం అపహరించిందన్న బీజేపీ ఎంపీ వ్యాఖ్యలపై చైనా విదేశాంగ శాఖ గురువారం స్పందించింది. ఆ బాలుడి ఆచూకీ తమకూ తెలియదని చైనా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఆ సంఘటన గురించి తమకు తెలియనే తెలియదని పేర్కొంది. అయితే సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ చొరబాట్లను, కార్యకలాపాలను మాత్రం కచ్చితంగా అణచివేస్తామని పేర్కొంది.
అరుణాచల్ ప్రదేశ్కు చెందిన 17 ఏళ్ల మిరమ్ తారన్ అనే బాలుడ్ని చైనా సైన్యం ఎత్తుకెళ్లిందని ఆ రాష్ట్ర ఎంపీ తాపిర్ గావో ఆరోపించారు. లుంగ్తాజోర్ ప్రాంతం నుంచి ఈ బాలుడ్ని అపహరించారని ఎంపీ గావో ఓ ట్వీట్లో పేర్కొన్నారు. తారన్ స్నేహితుడు జానీ యయింగ్ మాత్రం చైనా దళాల నుంచి తప్పించుకున్నారని, ఆ కుర్రాడు ఇచ్చిన సమాచారంతోనే చైనా దళాలు మిరమ్ను అపహరించినట్లు తెలుస్తోందన్నారు. తారన్, ఆయన స్నేహితుడు జానీ యయింగ్కు వేటకు వెళ్లే అలవాటుంది. సాంగ్పో నది భారత్లోకి ప్రవేశించే ప్రాంతంలోనే ఈ అపహరణ ఘటన జరిగింది.
ఈ అంశం వెలుగులోకి రావడంతో భారత ఆర్మీ స్పందించింది. చైనా ఆర్మీకి భారత సైన్యం ఫోన్ చేసింది. హాట్లైన్ ద్వారా భారత ఆర్మీ మిరమ్ తారన్ గురించి చైనా ఆర్మీకి చెప్పింది. ప్రోటోకాల్ ప్రకారం ఆ బాలుడ్ని అప్పగించాలని భారత సైన్యం కోరింది.