China | న్యూఢిల్లీ, డిసెంబర్ 22: అణ్వాయుధాలను పరీక్షించేందుకు చైనా సిద్ధమవుతున్నదా? ఇందుకోసం జిన్జియాన్ రీజియన్లోని లాప్ నుర్ న్యూక్లియర్ పరీక్ష కేంద్రాన్ని మళ్లీ క్రియాశీలం(రీయాక్టివేషన్)చేస్తున్నదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఈ వాదనను బలపర్చేలా తాజాగా మాక్సర్ శాటిలైట్ చిత్రాలను విడుదల చేసింది. దీనిపై అమెరికా మీడియా సంస్థ న్యూయార్క్ టైమ్స్ మొదటగా ఓ కథనం ప్రచురించింది. దీంతో ప్రస్తుతం ఈ అంశంపై పెద్దయెత్తున చర్చ నడుస్తున్నది. అణు పరీక్ష కేంద్రాన్ని అప్గ్రేడ్ చేస్తున్నట్టు లాప్ నుర్ శాటిలైట్ చిత్రాల్లో కనిపిస్తున్నది. 2017 నాటికి కొన్ని భవనాలు మాత్రమే ఉండే ఆ సైట్.. ఇప్పుడు ఆధునీకరణ అయిందని, భద్రతా ఫెన్సింగ్లతో కూడిన అత్యాధునిక కాంప్లెక్స్లు వచ్చాయని న్యూయార్క్ టైమ్స్ పేర్కొన్నది. పెద్ద పేలుళ్లను నిర్వహించేందుకు అనువైన బంకర్, కొత్త ఎయిర్ బేస్ వంటివి కొత్త నిర్మాణాల్లో ఉన్నాయని తెలిపింది. ఒక 90 అడుగుల పొడవైన పెద్ద డ్రిల్లింగ్ మెషీన్ కూడా ఉన్నదని పేర్కొన్నది. ఈ చిత్రాలను చూస్తే చైనా త్వరలో పూర్తిస్థాయిలో అణు పరీక్షలు లేదా సబ్ క్రిటికల్ అణు పేలుళ్లను నిర్వహించేలా కనిపిస్తున్నదని ఎన్డీటీవీ తన తాజా కథనంలో వెల్లడించింది. చైనా చేస్తున్న ప్రయత్నాలు కొత్త తరం బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులతో వినియోగించే కొత్త న్యూక్లియర్ వార్హెడ్లను పరీక్షించేందుకు, వాటి సామర్థ్యాన్ని పరిశీలించేందుకు ఆ దేశం ఆసక్తి కనబరుస్తున్నట్టు పేర్కొన్నది. ప్రముఖ అంతర్జాతీయ జియోస్పేషియల్ నిఘా నిపుణుడు డాక్టర్ బార్బియార్జ్ అందించిన ఆధారాలతో న్యూయార్క్ టైమ్స్ ఈ శాటిలైట్ చిత్రాలపై తన కథనంలో విశ్లేషణ చేసింది.
చైనా తన క్షిపణి వ్యవస్థ సామర్థ్యాన్ని ఇటీవలి కాలంలో మరింత విస్తరించిందని మిడిల్బురీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ అధ్యయనం గతంలో పేర్కొన్నది. దశాబ్దం క్రితం చైనా వద్ద 50 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు ఉండగా.. 2028 నాటికి ఆ సంఖ్యను వెయ్యికి పైగా పెంచేందుకు చైనా ఆర్మీ కసరత్తు చేస్తున్నదని ఆ నివేదిక వెల్లడించింది.
తన ఆయుధాలను నిఘా వ్యవస్థల కంట పడకుండా చూసేందుకు ఓ సరికొత్త మెటీరియల్ను చైనా అభివృద్ధి చేసింది. క్రూయిజ్ క్షిపణులను జెట్లైనర్ల లాంటి పెద్ద విమానాల్లా భ్రమింపజేయడం ద్వారా అవి శత్రుదేశాల గగనతల రక్షణ వ్యవస్థలను ఛేదించేందుకు ఇది వీలుకల్పిస్తుంది. బంగారు ముసుగు (గోల్డెన్ వెయిల్)గా పిలిచే ఈ కొత్త పదార్థం చాలా చవకైనది. చైనా క్షిపణులను ప్రయాణికుల విమానాల్లా భ్రమింపజేసేందుకు దీన్ని ఉపయోగించనున్నారు. వాయువ్య చైనాలోని పరిశోధకుల బృందం అభివృద్ధి చేసిన ఈ పదార్థం స్టెల్త్ టెక్నాలజీకి పూర్తి భిన్నమైనది. గువామ్, అమెరికా ప్రధాన భూభాగాల్లోని గగనతల రక్షణ వ్యవస్థలను ఛేదించేందుకు విభిన్న పద్ధతులను రూపొందించుకునేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా దీన్ని తయారు చేశారు. చైనా సైనిక దళం ప్రధానంగా రక్షణాత్మక ధోరణిని అవలంబిస్తున్నప్పటికీ తైవాన్ లేదా దక్షిణ చైనా సముద్రం లాంటి ప్రాంతీయ వ్యవహారాల్లో విదేశీ జోక్యాన్ని ప్రతిఘటించేందుకు నూతన సాంకేతికతలు ఓ నిరోధకంలా చైనాకు ఉపకరిస్తాయని నిపుణులు చెప్తున్నారు.