Beijing | భారత ఆర్మీ చీఫ్ ఎం.ఎం. నరవాణే టార్గెట్గా చైనా విమర్శలకు దిగింది. భారత్లోని అంతర్గత సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే నరవాణే సంచలన వ్యాఖ్యలకు దిగుతున్నారని చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. సీడీఎస్ బిపిన్ రావత్ తర్వాత ఆర్మీ చీఫ్ నరవాణేకు మోదీ సర్కార్ కొన్ని బాధ్యతలు అప్పజెప్పిందని గ్లోబల్ టైమ్స్ తన వ్యాసంలో పేర్కొంది. మొదటి నుంచి కూడా చైనాను సీడీఎస్ రావత్ వ్యతిరేకిస్తూనే వుండేవారని, నరవాణే కూడా ఆయన అడుగు జాడల్లోనే నడుస్తున్నారని విమర్శించింది.
ఇలా చేయడం ద్వారా తన స్థానాన్ని మరింత పదిలపర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారని చైనా రాసుకుంది.చైనా, ఇండియా కమాండర్ స్థాయిలో జరిగిన చర్చలకు అనుగుణంగా నరవాణే మసులుకోవడం లేదని రాసుకున్నారు. ఎల్ఏసీ వద్ద ఏకపక్షంగా సరిహద్దు రూపు రేఖలను మార్చడానికి భారత్ ఏమాత్రం అంగీకరించదని, అలాంటి పరిణామాలకు కచ్చితంగా అడ్డుకట్ట వేస్తామని ఆర్మీ చీఫ్ నరవాణే కరాఖండిగా చెప్పేశారు. ఈ కరాఖండిగా చెప్పడం చైనాకు రుచించకపోయి ఉండొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.
ఇరు దేశాల ప్రతినిధుల మధ్య జరిగిన 14 వ రౌండ్ స్థాయి చర్చలకు తగ్గట్టుగా నరవాణే వ్యాఖ్యలు లేవని చైనా విమర్శించింది. నరవాణే నిత్యం తన ఆర్మీతో చైనా వ్యతిరేక వ్యాఖ్యలనే ఉటంకిస్తూ వుంటారని, ఎప్పుడూ చైనాకు వ్యతిరేకంగానే చెబుతూ వుంటారని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.