న్యూఢిల్లీ, జూన్ 18: కరోనా ఉద్ధృతితో సుమారు ఏడాదిన్నరగా విద్యాసంస్థలు మూసిఉండటంతో పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. దీంతో వారు ప్రత్యక్షంగా పాఠశాల విద్యకు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో వారిని చురుగ్గా ఉంచుతూ గృహ ఆధారిత అభ్యాసాన్ని (హోం బేస్డ్ లర్నింగ్) సులభతరం చేసేందుకు తల్లిదండ్రులు, విద్యార్థుల సంరక్షకులు కీలక పాత్ర పోషించాలని కేంద్ర విద్యాశాఖ తెలిపింది. ఈ మేరకు విద్యార్థుల తల్లిదండ్రులు, సంరక్షకులకు శనివారం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇదే విషయమై కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘ఇల్లే తొలి పాఠశాల, తల్లిదండ్రులే మొదటి గురువులు అని నేను బలంగా నమ్ముతా. ఈ మహమ్మారి సమయంలో పిల్లల ఎదుగుదలలో, నేర్చుకోవడంలో తల్లిదండ్రులది అత్యంత కీలకపాత్ర’ అని పేర్కొన్నారు.
పిల్లలు చదువుకునేందుకు ఇంట్లో సానుకూల వాతవరణాన్ని కల్పించాలి.
వారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ పౌష్టికాహారాన్ని అందించాలి.
హోంవర్క్, ఇతర పాఠ్యాంశాల సంబంధిత కార్యకలాపాలతోపాటు నిర్ణయాలలో పాలుపంచుకోవాలి.
ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులకు, సబ్జెక్టుల్లో వెనుకబడిన వారికి అవసరమైన వాటిని సమకూర్చాలి.
కేసులు తగ్గిన అనంతరం పాఠశాలలను తెరిచే అవకాశం ఉన్న నేపథ్యంలో.. త్వరలోనే స్కూల్స్ తెరుస్తారనే భరోసా విద్యార్థులకు ఇవ్వాలి.
మహమ్మారి విజృంభణ కారణంగా స్కూల్స్ మూసివేసినప్పటికీ, తాము పాఠశాల విద్యార్థులమేనన్న విషయాన్ని ఎప్పుడూ పిల్లలకు గుర్తుచేస్తూ ఉండాలి.
రోజుకు కనీసం 20-30 నిమిషాలపాటు పిల్లలతో కలిసి కూర్చోవాలి. పాఠశాలలో వాళ్లు ఏమి నేర్చుకున్నారో అడిగి తెలుసుకోవాలి.
పిల్లలతో ఆన్లైన్లో బాలసభ (విద్యార్థుల సమావేశాలు) నిర్వహించాలి. దీంతో.. పద్యాలు, కథలు, ఆలోచనలు, అభిప్రాయాలను తోటి విద్యార్థులతో పంచుకునే అవకాశం పిల్లలకు కలుగుతుంది.
విద్యార్థుల సామర్థ్యాన్ని బట్టి టీచర్లు కొన్ని ప్రశ్నలను తయారుచేసి తల్లిదండ్రులకు ఇవ్వాలి.
నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు పిల్లలకు తర్ఫీదును ఇవ్వడానికి పాఠశాల సిబ్బంది సేవలను వినియోగించుకోవాలి.