న్యూఢిల్లీ/ వాషింగ్టన్: భారత్, పాకిస్థాన్ విభజనతో విడిపోయిన బాల్య స్నేహితులు చాలా కాలం తర్వాత అమెరికాలో కలిశారు. (Childhood Friends Reunite) వృద్ధప్యంలో ఉన్న ఇద్దరు మిత్రులు ఆప్యాయంగా పలుకరించుకున్నారు. అలాగే వారి ఆనందానికి అంతులేకుండా పోయింది. ప్రియమైన బాల్య స్నేహితులైన సురేశ్ కొఠారి, ఏజీ షకీర్ గుజరాత్లోని దీసాలో పుట్టి పెరిగారు. 1947లో దేశ విభజన సందర్భంగా 12 ఏళ్ల వయస్సులో ఇద్దరు మిత్రులు విడిపోయారు. ఏజీ షకీర్ కుటుంబం పాకిస్థాన్లోని రావల్పిండిలో స్థిరపడింది. ఇద్దరు మిత్రులు కొన్ని రోజులు ఉత్తరాలు రాసుకున్నారు.
కాగా, భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తడంతో 1947 నుంచి 1981 వరకు సురేశ్ కొఠారి, ఏజీ షకీర్ మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ లేదు. అయితే 1982లో సుమారు 50 ఏళ్ల వయసులో ఉన్న వారిద్దరూ మరో స్నేహితుడి ద్వారా అమెరికాలోని న్యూయార్క్లో తొలిసారి కలుసుకున్నారు. అనంతరం 41 ఏళ్ల తర్వాత 90 ఏళ్ల వయసులో ఉన్న బాల్య మిత్రులు 2023 అక్టోబర్లో మరోసారి అమెరికాలో కలిశారు.
మరోవైపు దేశ విభజనతో విడిపోయిన బాల్య స్నేహితుల కలయికపై సురేశ్ కొఠారి మనుమరాలైన మేగన్ కొఠారి ఒక డాక్యుమెంటరీ తీసింది. ఈ ఫొటోలు, వీడియోలను ‘బ్రౌన్ హిస్టరీ’ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. దీంతో బాల్య స్నేహితుల పునఃకలయిక అంశం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు కూడా దీనిపై సంతోషం వ్యక్తం చేశారు.