నాసిక్: అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న శివ్రాజ్ దావరే అనే చిన్నారికి అమెరికా సంస్థ రూ.16 కోట్ల విలువైన ఇంజెక్షన్ను ఫ్రీగా ఇచ్చింది. ఓ లక్కీ డ్రా గెలవడంతో ఆ చిన్నారికి ఖరీదైన ఇంజెక్షన్ ఇలా ఉచితంగా వచ్చింది. మహారాష్ట్రలోని నాసిక్కు చెందిన ఈ రెండేళ్ల చిన్నారి అరుదైన స్పైనల్ మస్కులర్ అట్రోఫీ (ఎస్ఎంఏ) వ్యాధితో బాధపడుతున్నాడు. దీనికోసం జన్యు మార్పిడి థెరపీ కోసం ఉపయోగించే జోల్గెన్స్మా ఇంజెక్షన్ ( zolgensma injection )ను అమెరికా సంస్థ తయారు చేస్తోంది. అయితే ఇంత ఖరీదైన ఇంజెక్షన్ కొనడం మామూలు వాళ్ల వల్ల సాధ్యం కాదు. శివ్రాజ్ తల్లిదండ్రులు విశాల్, కిరణ్ల పరిస్థితీ అదే. అయితే వాళ్లు మాత్రం తమ చిన్నారిపై ఆశలు వదులుకోలేదు.
ముంబైలోని హిందూజా హాస్పిటల్కు తీసుకెళ్లగా అక్కడ న్యూరాలజిస్ట్ డాక్టర్ బ్రజేష్ ఉదాని ఈ జోల్గెన్స్మా ఇంజెక్షన్నే సమర్థవంతమైనదని చెప్పారు. అయితే నాసిక్లో జిరాక్స్ షాప్ నడిపే వాళ్లకు అంత పెద్ద మొత్తం సమకూర్చడం అసాధ్యం. ఆ సమయంలోనే ఈ ఇంజెక్షన్ కోసం అమెరికా సంస్థ నిర్వహించే లాటరీకి దరఖాస్తు చేసుకోమని సలహా ఇచ్చారు. గతేడాది డిసెంబర్ 25న వీళ్లు దరఖాస్తు చేసుకోగా.. లక్కీ డ్రాలో విజేతలుగా తేలారు. ఈ ఏడాది జనవరి 19న ఆ ఇంజెక్షన్ను ఇచ్చారు. దీంతో ఆ చిన్నారి ఇప్పుడు ఆనందంగా తన రెండో బర్త్ డే జరుపుకోబోతున్నాడు.