CM Stalin | చెన్నై, డిసెంబర్ 14: హిందీ జాతీయ భాష కాదని, కానీ, అది జాతీయ భాషగా పేర్కొంటూ కొందరు తప్పుదోవ పట్టించేలా వ్యవహరించడం ఆందోళన కలిగిస్తున్నదని తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ అన్నారు. తనకు హిందీ రాదని పేర్కొన్న తమిళనాడుకు చెందిన ఒక మహిళను గోవా ఎయిర్పోర్టులో సీఐఎస్ఎఫ్కు చెందిన అధికారి అవమానించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తనకు హిందీ రాదని షర్మిల అనే మహిళ సీఐఎస్ఎఫ్ అధికారికి తెలుపగా, ‘మీ తమిళనాడు భారత్లోనే ఉంది కదా. ప్రతి భారతీయుడు జాతీయ భాష హిందీ నేర్చుకోవాల్సిందే’ అంటూ ఆ అధికారి ఆమెను అవమానించారన్నారు.
హిందీ మాట్లాడని రాష్ర్టాల ప్రజలు తరచూ ఎయిర్పోర్టులలో సీఐఎస్ఎఫ్ సిబ్బంది నుంచి అవమానాలను ఎదుర్కొంటున్నారని, పైగా వారు హిందీ జాతీయ భాషగా పేర్కొంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ‘ఎక్స్’లో పేర్కొన్నారు. దీనిపై మంత్రి ఉదయనిధి స్టాలిన్ స్పందిస్తూ వెంటనే ఆ ఆధికారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.