న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి శుక్రవారం కోర్టుకు వచ్చారు. దీంతో సీనియర్ న్యాయమూర్తులు, న్యాయవాదులు ఆశ్చర్యపోయారు. సీజేఐ చంద్రచూడ్ శుక్రవారం ఉదయం పది గంటలకు కుమార్తెలైన 20 ఏళ్ల ప్రియాంక, 16 ఏళ్ల మహితో కలిసి సుప్రీంకోర్టుకు వచ్చారు. దివ్యాంగులైన వారిద్దరికీ సీజేఐ కోర్టు రూమ్ను చూపడంతోపాటు తన విధుల గురించి వివరించారు. సుప్రీంకోర్టు ఎలా పని చేస్తుంది, న్యాయవాదులు ఎలా వాదిస్తారు అన్నది ప్రత్యక్షంగా వారికి చూపించారు. అనంతరం కుమార్తెలను తన చాంబర్కు ఆయన తీసుకెళ్లారు.
కాగా, సుప్రీంకోర్టును చూడాలని కుమార్తెలు ఆసక్తి చూపడంతో ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ వారిద్దరిని కోర్టుకు తీసుకువచ్చి పని తీరును వివరించారని సుప్రీంకోర్టు అధికారులు మీడియాకు తెలిపారు. గత ఏడాది నవంబర్ 9న సీజేఐగా బాధ్యతలు చేపట్టిన ఆయన రెండేళ్లపాటు ఆ పదవిలో కొనసాగనున్నారు.