న్యూఢిల్లీ : పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న సందర్భంగా అన్ని అంశాలపై చర్చ జరుపుతామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చినా తొలి రోజే ఎలాంటి చర్చా చేపట్టకుండా వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం వెనక్కితీసుకుందని కాంగ్రెస్ నేత, రాజ్యసభ ఎంపీ పీ చిదంబరం అన్నారు. ఉభయపక్షాలు అంగీకరించకుండానే వ్యవసాయ చట్టాలను చర్చ లేకుండా ఆమోదించారని, ఇరు పక్షాలూ అంగీకరించినా ఆ చట్టాలను చర్చ జరగకుండానే రద్దు చేశారని..ఏ పద్ధతిలో అయినా అసలు చర్చ ఊసేలేదని చిదంబరం మంగళవారం ట్వీట్ చేశారు.
చర్చరహిత పార్లమెంటరీ ప్రజాస్వామ్యమా వర్ధిల్లు అని చిదంబరం మోదీ సర్కార్కు చురకలు వేశారు. వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు,2021ని సోమవారం లోక్సభ, రాజ్యసభల్లో ఎలాంటి చర్చ నిర్వహించకుండా మూజువాణి ఓటుతో ఆమోదించిన సంగతి తెలిసిందే. సాగు చట్టాల రద్దు బిల్లును చర్చ లేకుండానే ప్రభుత్వం ఆమోదింపచేసుకుందని తృణమూల్ రాజ్యసభ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ కూడా మోదీ సర్కార్ తీరును దుయ్యబట్టారు.