న్యూఢిల్లీ : నోట్ల రద్దు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసిన క్రమంలో ఈ అంశంపై కేంద్ర ఆర్ధిక శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పీ చిదంబరం స్పందించారు. నోట్ల రద్దు నిర్ణయం విజ్ఞతను సమర్ధించడం కానీ, నోట్ల రద్దు లక్ష్యం నెరవేరిందని కానీ సర్వోన్నత న్యాయస్ధానం పేర్కొనలేదని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రూ .1000, రూ .500 నోట్ల రద్దు నిర్ణయాన్ని తోసిపుచ్చలేమని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 4-1 తేడాతో స్పష్టం చేసింది. మరోవైపు నోట్ల రద్దు చట్టవిరుద్ధమని జస్టిస్ బీవీ నాగరత్న పేర్కొన్నారు.
ఆర్బీఐ బోర్డు నోట్ల రద్దుకు స్వతంత్రంగా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని, ప్రభుత్వ సలహాలో ఆర్బీఐ నోట్ల రద్దు చేపట్టరాదని పేర్కొన్నారు. మైనారిటీ జడ్జిమెంట్ను చిదంబరం ప్రస్తావిస్తూ నోట్ల రద్దు నిర్ణయం వెనుక అక్రమాలు, లోపభూయిష్ట విధానాలను ఈ తీర్పు తప్పుపట్టిందని, తాము ఈ జడ్జిమెంట్ పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నామని చెప్పారు. మైనారిటీ జడ్జిమెంట్ పార్లమెంట్ కీలక భూమికను గుర్తుచేసిందని పేర్కొన్నారు. కాగా, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యలు ధర్మాసనం నోట్ల రద్దును ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది.
ఈ ధర్మాసనంలో జస్టిస్ బీఆర్ గవాయి, ఏఎస్ బొప్పన్న, వీ సుబ్రమణియన్, బీవీ నాగరత్న ఉన్నారు.నోట్ల రద్దు నిర్ణయాన్ని కేంద్ర సర్కార్ తీసుకున్నంత మాత్రాన దాన్ని తప్పుపట్టలేమని సుప్రీం బెంచ్ తన తీర్పులో అభిప్రాయపడింది. నలుగురు సభ్యులు ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించారు. జస్టిస్ బీవీ నాగరత్న మాత్రం మెజారిటీకి వ్యతిరేంగా తన అభిప్రాయాల్ని తీర్పులో వెల్లడించారు. ప్రభుత్వం ద్వారా కాకుండా పార్లమెంట్ ద్వారా ఆ చర్య చేపడితే బాగుండేదని జస్టిస్ బీవీ నాగరత్న తెలిపారు.