రాయ్పూర్ : కరోనా వైరస్ కేసుల పెరుగుదలతో రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నియంత్రణ చర్యలు చేపడుతున్నాయి. కొవిడ్-19 కట్టడికి చత్తీస్ఘడ్ రాజధాని రాయ్పూర్లో ఈనెల 9 నుంచి 19వరకూ సంపూర్ణ లాక్డౌన్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక కొద్దిరోజులుగా రాయ్పూర్లో రాత్రివేళల్లో కర్ఫ్యూ విధించినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో రాష్ట్ర రాజధానిలో సంపూర్ణ లాక్డౌన్కు చత్తీస్ఘడ్ ప్రభుత్వం మొగ్గుచూపింది.
మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అత్యధికంగా 9921 తాజా కేసులు వెలుగుచూశాయి.చత్తీస్ఘడ్లో ఇప్పటివరకూ 3,86,269 కొవిడ్ కేసులు నమోదవగా మహమ్మారి బారినపడి 4416 మంది మరణించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరగడంతో పాటు మృతుల సంఖ్య ఎగబాకడంతో ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని, కొవిడ్ నిబంధనలను విధిగా పాటించాలని ముఖ్యమంత్రి భూపేష్ బాగేల్ ప్రజలను కోరారు.