Chhattisgarh : చత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి తనయుడు అమిత్ జోగికి ఆ రాష్ట్ర హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2003 నాటి హత్య కేసులో తాజాగా తీర్పు వెల్లడించింది. సీనియర్ ఎన్సీపీ లీడర్ అయిన రామావతార్ జగ్గి జూన్ 4, 2003న హత్యకు గురయ్యాడు. పట్టపగలు అందరూ చూస్తుండగానే దుండుగులు అతడిని కాల్చి చంపారు. జగ్గితోపాటు పక్కనే ఉన్న ఆయన ప్రధాన అనుచరుడు విద్యాచరణ్ శుక్లా కూడా ఈ కాల్పుల ఘటనలో మరణించాడు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు అజిత్ జోగి తనయుడు అమిత్ జోగి సహా 31 మందిని నిందితులుగా గుర్తించారు.
ఈ కేసుపై విచారణ జరిపిన రాయ్పూర్ కోర్టు 28 మందిని నిందితులుగా గుర్తించింది. వారికి శిక్షలు ఖరారు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కానీ, సరైన ఆధారాలు లేని కారణంగా అమిత్ జోగిని నిర్దోషిగా ప్రకటించింది. ఈ తీర్పు 2007లో వెలువడింది. అయితే, హత్యకు గురైన జగ్గి తనయుడు సతీష్ జగ్గి మాత్రం తన న్యాయపోరాటాన్ని ఆపలేదు. రాయ్పూర్ కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. ఈ తీర్పు సరైంది కాదని, అమిత్ జోగిని కూడా శిక్షించాలని కోరాడు. అయితే, సుప్రీం కోర్టు ఈ కేసును చత్తీస్గఢ్ హైకోర్టుకు అప్పగించింది. తిరిగి విచారణ ప్రారంభించాలని సూచించింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు తాజాగా తీర్పు వెల్లడించింది. చీఫ్ జస్టిస్ రమేష్ సిన్హా, జస్టిస్ అరవింద్ కుమార్ వర్మ ఆధ్వర్యంలోని ధర్మాసనం 2007 నాటి తీర్పును కొట్టివేసింది. ఈ హత్యలో అమిత్ జోగి పాత్రను గుర్తించింది.
అతడికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. అలాగే, రూ.వెయ్యి జరిమానా కూడా విధించింది. మరోవైపు, ఈ తీర్పుపై అమిత్ అసహనం వ్యక్తం చేశాడు. తనపై ఆధారాలు లేకుండానే శిక్ష విధించారని, దీనిపై న్యాయపోరాటం చేస్తానని ప్రకటించాడు. అమిత్ ప్రస్తుతం జనతా కాంగ్రెస్ చత్తీస్గడ్ పార్టీ నేతగా కొనసాగుతున్నాడు. ఇంకోవైపు, రామావతార్ జగ్గి తనయుడు సతీష్ జగ్గి మాత్రం ఈ తీర్పుపై హర్షం వ్యక్తం చేశాడు.