రాయ్పూర్: ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా విష్ణు డియో సాయ్ ఎంపికయ్యారు. గత వారం రోజులుగా ఛత్తీస్గఢ్ సీఎం ఎంపిక కోసం తీవ్ర కసరత్తు చేసిన బీజేపీ అధిష్ఠానం ఆఖరికి విష్ణు డియో సాయ్ వైపు మొగ్గు చూపింది. ఆదివారం ఉదయం సమావేశమైన బీజేపీ శాసనసభాపక్షం విష్ణు డియోను సీఎంగా ఎన్నుకున్నట్లు ప్రకటించింది. ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్సింగ్ కూడా సీఎం రేసులో ఉన్నప్పటికీ బీజేపీ హైకమాండ్ ఆయనను పక్కన పెట్టింది.
విష్ణు డియో సాయ్ గతంలో ఛత్తీస్గఢ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. అంతేగాక ప్రధాని నరేంద్రమోదీ తొలి క్యాబినెట్లో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. కాగా, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇటీవల ఛత్తీస్గఢ్ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగాయి. మొత్తం 90 స్థానాలకుగాను నవంబర్ 7, 17 తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించారు. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.
బీజేపీ 54 స్థానాల్లో గెలిచి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ 35 స్థానాలకే పరిమితమై అధికారాన్ని కోల్పోయింది. మెజారిటీ స్థానాలు గెలిచిన బీజేపీ ఇప్పుడు సీఎం ఎంపిక పూర్తిచేయడంతో ఇక ఛత్తీస్గఢ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతున్నది.