CM Bhupesh Baghel | హైదరాబాద్, అక్టోబర్ 11 (స్పెషల్ టాస్క్ బ్యూరో- నమస్తే తెలంగాణ): ఛత్తీస్గఢ్లోని అధికార కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో అంతకంతకూ వ్యతిరేకత పెరిగిపోతున్నది. రమణ్ సింగ్ నేతృత్వంలోని 15 ఏండ్ల బీజేపీ పాలనకు ముగింపు పలుకుతూ రాష్ట్ర ప్రజలు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు పట్టంగట్టారు. అయితే, గత ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రధాన హామీలను అమలు చేయకపోవడం, రాష్ట్రంలో అభివృద్ధి పడకేయడం వెరసి హస్తం పార్టీపై ప్రస్తుతం ఓటర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
అంతర్గత కుమ్ములాటలు పార్టీని మరింత సంక్షోభంలోకి నెడుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం రాత్రి రాయ్పూర్లోని కాంగ్రెస్ కార్యాలయంలో స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల పేర్లను నిర్ణయించడమే లక్ష్యంగా ఈ భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న సీఎం భూపేశ్ బఘేల్ తన ఫోన్లో ‘క్యాండీక్రష్’ గేమ్ ఆడుతూ కనిపించారు. కాంగ్రెస్కు అత్యంత కీలకమైన ఈ భేటీపై ఆయన అంతగా ఆసక్తి కనబర్చలేదు. దీంతో ప్రస్తుతం ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. హామీలను నిలబెట్టుకోలేని కాంగ్రెస్కు వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని తెలిసే.. సీఎం ‘క్యాండీక్రష్’ గేమ్ ఆడుతూ రిలాక్స్ అయ్యారని విపక్షాలు వ్యంగ్యాస్ర్తాలు సంధించాయి.
గెలుపు అంత తేలిక కాదు
2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ‘ప్రజా మేనిఫెస్టో’ పేరిట మేనిఫెస్టోని విడుదల చేసింది. ఐదేండ్లు గడిచినప్పటికీ, అందులోని ప్రధాన హామీలను నెరవేర్చలేదు. పైగా, బొగ్గు రవాణాలో అవినీతి, మద్యం అమ్మకాల్లో అక్రమాలు, మినరల్ ఫౌండేషన్ నిధుల దుర్వినియోగం, పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకాల్లో అవకతవకలు.. ఇవన్నీ కాంగ్రెస్ సర్కారుకు తలనొప్పిగా మారాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో హస్తంపార్టీ గెలుపు అంత సులభం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.