Fake Facebook ID | హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ పేరిట నకిలీ ఫేస్బుక్ అకౌంట్ను తయారు చేసిన ఓ దుండగుడు.. దాంతో పలువురిని డబ్బులు అడుగుతున్నాడు. ఈ విషయాన్ని రాజ్ భవన్ వర్గాలు సైబర్ సెల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సైబర్ సెల్ నిపుణులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
కొందరు వ్యక్తులు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్కు చెందిన నకిలీ ఫేస్బుక్ ఐడీని సృష్టించారు. ఈ ఐడీ ద్వారా కొంత మందికి మెసెంజర్లో మెసేజ్లు పంపి చాలా అర్జంట్గా ఉన్నదని చెప్పి డబ్బులు పంపాలని కోరుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న గవర్నర్ సిబ్బంది సైబర్ క్రైమ్కు ఫిర్యాదు చేశారు. కొందరు దుర్మార్గులు తన పేరుతో నకిలీ ఫేస్బుక్ ఐడీని సృష్టించి తనకు తెలిసిన వారి నుంచి డబ్బు అడుగుతున్నారని హిమాచల్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ తెలిపారు. ఈ విషయమై సిమ్లాలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో రాజ్ భవన్ తరపున ఫిర్యాదు చేశారన్నారు.
గవర్నర్ పేరిట నకిలీ ఫేస్బుక్ ఖాతా తయారైన విషయంపై ఫేస్బుక్కు లిఖితపూర్వక లేఖ పంపామని, వెంటనే ఖాతాను బ్లాక్ చేయాలని కోరినట్లు సైబర్ క్రైమ్ విభాగం ఏఎస్పీ సిమ్లా భూపిందర్ నేగి తెలిపారు. ఇదే సమయంలో మొత్తం వ్యవహారంపై విచారణ కొనసాగుతున్నదని చెప్పారు. సైబర్ నేరగాళ్లు ఎక్కడి నుంచి ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారనేది తెలుసుకునే పనిలో నిమగ్నమైనట్లు ఆయన పేర్కొన్నారు. గవర్నర్ పేరిట డబ్బు కోరుతూ వచ్చే మెసేజ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి మెసేజ్లు రాగానే తమకు సమాచారం అందించాలని ఆయన సూచించారు.