చెన్నై: కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా తరహాలో ఒక సంఘటన జరిగింది. అధికారుల నుంచి తప్పించుకునేందుకు స్మగ్లర్లు కొంత బంగారాన్ని మూటకట్టి సముద్రంలో పడేశారు (smugglers throw gold into sea). అయితే అధికారులు ఆ బంగారాన్ని కూడా సముద్రం నుంచి వెలికితీశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తమిళనాడులో ఈ సంఘటన జరిగింది. శ్రీలంక నుంచి భారత్కు బంగారం అక్రమ రవాణా జరుగుతున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు సమాచారం అందింది. దీంతో కోస్టల్ గార్డ్, కస్టమ్స్, డీఆర్ఐ అధికారులు కలిసి సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. భారత్, శ్రీలంక అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖా ప్రాంతమైన గల్ఫ్ ఆఫ్ మన్నార్ వద్ద మత్యకారుల బోటులపై నిఘా పెట్టారు.
కాగా, మే 30న శ్రీలంక నుంచి భారత్ వైపు వస్తున్న ఒక అనుమానాస్పద బోటు అధికారుల కంటపడింది. మండపం ఫిషింగ్ హార్బర్ సమీపంలో ఉన్న ఆ బోటును అధికారులు ఛేజ్ చేశారు. గమనించిన బోటులోని వ్యక్తులు తమ వద్ద ఉన్న కొంత బంగారాన్ని మూటగా కట్టి తాడు సహాయంతో సముద్రంలోకి జారవిడిచారు. అయితే వారు తప్పించుకోలేకపోయారు. దీంతో ఆ బోటులోని ముగ్గురు వ్యక్తులను కస్టడీలోకి తీసుకున్నారు. ఆ బోటులో ఉన్న 21 కేజీల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు స్మగ్లర్లు సముద్రంలో పడేసిన 12 కేజీల బంగారం కోసం అధికారులు మరో ఆపరేషన్ చేపట్టారు. ఈ నెల 1న కోస్ట్గార్డ్కు చెందిన డైవర్లు సముద్రంలోకి వెళ్లారు. మూట కట్టి తాడు సహాయంతో సముద్రంలోకి జారవిడిచిన 12 కేజీల బంగారాన్ని కూడా వెలికితీశారు. అలాగే మరో బోటులో స్మగ్లింగ్ చేస్తున్న 22 కేజీల బంగారాన్ని కూడా డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, స్మగ్లర్లు సముద్రంలో పడేసిన బంగారాన్ని అధికారులు వెలికి తీసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#WATCH | How Indian Coast Guard personnel, along with the DRI officials and Customs, carried out the special operation to seize 32.689 kgs of Gold valued at approx. Rs 20.2 Crores, from two fishing boats at the Gulf of Mannar area off Tamil Nadu.
(Video: Indian Coast Guard) pic.twitter.com/fQOtJIWYbF
— ANI (@ANI) June 1, 2023