Madhya pradesh | ప్రజలకు ఏవైనా సమస్యలుంటే చెప్పుకొనేందుకు సీఎం హెల్ప్లైన్ ఏర్పాటు చేశారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేసుకున్నారు. తీరాచూస్తే హెల్ప్లైన్కు ఫోన్చేసిన ప్రజలపై చార్జీలు బాదారు. ఇదీ డబుల్ ఇంజిన్ సర్కారుగా చెప్పుకొనే బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ సర్కారు నిర్వాకం.
ప్రజలనుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం 2014లో సీఎం హెల్ప్లైన్ నంబర్ 181ను అందుబాటులోకి తెచ్చింది. అయితే, ఈ సేవలకుగానూ ప్రజలపై చార్జీల భారం మోపింది. హెల్ప్లైన్కు కాల్ చేస్తే నిమిషానికి రూపాయి చొప్పున వసూలు చేసింది. అంటే సాధారణ జనం ఓ పదినిమిషాలు తమ సమస్యలు మొర చెప్పుకుంటే రూ.10 చెల్లించాల్సిందే. సీఎం హెల్ప్లైన్కు ఫోన్చేస్తే డబ్బులు వసూలు చేయడమేంటని ఇండోర్కు చెందిన రాజేంద్రసింగ్ అనే వ్యక్తి టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)కు ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన ట్రాయ్ అతడికి డబ్బులు తిరిగి చెల్లించాలని ఆదేశించింది. రాజేంద్ర సింగ్ ఫిర్యాదుతో తీగ లాగితే డొంక కదిలిందన్న చందంగా మధ్యప్రదేశ్లో సర్కార్ నిర్వాకం బయట పడింది.
ఇతర రాష్ట్రాల్లో హెల్ప్లైన్లకు సంబంధించి ఆయా ప్రభుత్వాలే కాల్ రేట్లు భరిస్తుండగా, మధ్యప్రదేశ్లో మాత్రం అందుకు విరుద్ధంగా చార్జీలు వసూలు చేయడంపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. మధ్యప్రదేశ్లో ఏడేండ్లలో సీఎం హెల్ప్లైన్కు 1.89 కోట్ల ఫిర్యాదులు రాగా, అందులో కేవలం మూడు లక్షల ఫిర్యాదులను మాత్రమే స్వీకరించినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.అయితే, మిగతా కోటి 86 లక్షల ఫిర్యాదులపై ఎలాంటి స్పందన లేదు.