Chardham Yatra | కేదార్నాథ్లో భారీగా మంచు కురుస్తున్నది. దాంతో అధికారులు చార్ధామ్ యాత్రను నిలిపివేశారు. సోన్ప్రయాగ్లో గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచి పర్యాటకులకు అనుమతి ఇవ్వడం లేదు. దాదాపు 4వేల మంది భక్తులను కేదార్నాథ్ వెళ్లకుండా అధికారులు అడ్డుకొని.. వాతావరణం అనుకూలించే వరకు బాబా కేదార్నాథ్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వబోమన్నారు. గడిచిన 30 గంటల్లో దాదాపు 14వేల మంది వరకు కేదార్నాథ్కు పంపగా.. ఇందులో 50శాతం మంది మధ్యాహ్నం వరకు కేదార్నాథ్ ధామ్ వరకు చేరుకుకున్నారు.
మరికొందరు గౌరీకుండ్, జంగల్చట్టి, భీంబాలి, లించోలికి చేరుకున్నారు. అయితే, గురువారం ఉదయం నుంచి కేదార్నాథ్లో వాతావరణ ఒక్కసారిగా మారిపోయింది. భారీగా మంచుకురవడంతో విపరీతంగా చలి పెరిగింది. మంచుబారి నుంచి పర్యాటకులకు రక్షణ కల్పించేందుకు మందిర్ మార్గ్తో పాటు పలు ప్రదేశాల్లో జిల్లా విపత్తు నిర్వమణ అథారిటీ రెయిన్ షెల్టర్స్ను ఏర్పాటు చేసింది. భారీ హిమపాతం నేపథ్యంలో దుకాణాలు మూతపడ్డాయి.
మరోవైపు, పోలీసులు, ఐటీబీపీ, పీఆర్డీ జవాన్లు కేదార్నాథ్కు చేరుకున్న వారికి బాబా కేదార్నాథ్ దర్శనం జరిగేలా చొరవ చూపుతున్నారు. కేదార్నాథ్ ఆలయంతో పాటు పలుప్రాంతాల్లో దట్టంగా కురుస్తుండడంతో యాత్రను నిలిపివేయాలని జిల్లా మెస్ట్రేట్ ఆదేశించారని, దాంతో 4వేల మందిని సోన్ప్రయాగ్లో నిలిపివేసినట్లు అసిస్టెంట్ సెక్టార్ మేజిస్ట్రేట్ సందీప్ తెలిపారు. ఆలయం వద్ద పర్యాటకుల భద్రత, ఆరోగ్యం తదితర ఏర్పాట్లు చేస్తున్నట్లు రుద్రప్రయాగ్ కలెక్టర్ మయూర్ దీక్షిత్ పేర్కొన్నారు. మంచువర్షం నేపథ్యంలో వాతావరణ సూచనలతో ముందుకు సాగాలని ఎస్పీ విశాఖ అశోక్ భదానే సూచించారు.