చండీగఢ్: పంజాబ్ మంత్రివర్గంలో కళంకితులైన నేతలకు చోటు కల్పించారని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రివాల్ విమర్శించారు. అంతేగాక కీలక పదవుల్లో అవినీతి, అక్రమ ఆరోపణలున్న అధికారులను కూర్చోబెట్టారని కేజ్రివాల్ మండిపడ్డారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇవాళ పంజాబ్కు చేరుకున్న కేజ్రివాల్కు మొహాలీలో ఆ రాష్ట్ర ఆప్ నేతలు స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కేజ్రివాల్.. పంజాబ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చరణ్జీత్సింగ్ చన్నీకి నేను అభినందనలు తెలియజేస్తున్నా. అయితే అదే సమయంలో ఆయన మంత్రివర్గంలో కళంకిత నేతలకు చోటుకల్పించిన విషయాన్ని, అవినీతి అధికారులకు ఉన్నత పదవులు కట్టబెట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నా. అంతేకాదు ఆ మంత్రులను, అధికారులను తక్షణమే తొలగించి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా అని కేజ్రివాల్ వ్యాఖ్యానించారు.
బర్గారీ కేసు పంజాబ్ ప్రజలను తీవ్రంగా నిరుత్సాహానికి గురిచేసింది. ఆ కేసులో సూత్రధారి పేరును నేను ప్రత్యేకంగా చెప్పాల్సి అవసరం లేదు. అందరికీ తెలుసు. అతనికి ఇప్పటివరకు ఎలాంటి శిక్ష విధించలేదు. సీఎం చన్నీ సాబ్ ఒకసారి కున్వర్ విజయ్ ప్రతాప్సింగ్ నివేదికను చదవాలి. అప్పుడు అతనికి కళంకితులు ఎవరో తెలుస్తుంది. తెలుసుకున్న 24 గంటల లోపే వారిని అరెస్ట్ చేయించాలి అని ఢిల్లీ సీఎం సలహా ఇచ్చారు.