న్యూఢిల్లీ: కొందరు చేసే విద్వేషపూరిత ప్రసంగాల వల్ల సమాజానికి పూర్తి అపకారం జరుగుతుందని సుప్రీంకోర్టు పేర్కొన్నది. టీవీ వార్తల ప్రసారాలపై నియంత్రణ వ్యవస్థ లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో స్వేచ్ఛ, తటస్థ మీడియాను తాము కోరుకుంటున్నామని పేర్కొన్నది. ప్రస్తుతం మీడియాలో ప్రతి అంశం టీఆర్పీతో ముడిపడి ఉంటున్నదని, దాంతో ఆయా మీడియా చానల్స్ ఒకటికొకటి పోటీపడుతూ సమాజంలో చీలిక తెస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.
దేశవ్యాప్తంగా విద్వేషపూరిత వ్యాఖ్యలు, ప్రసంగాలు, రెచ్చగొట్టే చర్యలను నిలుపుదల చేసి, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై కోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఎయిరిండియా ఘటనను కోర్టు ప్రస్తావించింది. తోటి ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి వివరాలు ప్రకటించరాదన్న ప్రాథమిక విషయాన్ని మీడియా తెలుసుకోవాలని స్పష్టంచేసింది.
కేంద్రం తరఫున అడిషినల్ సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ మాట్లాడుతూ ఈ సమస్యను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్లో సవరణలు తెచ్చే యోచనలో ఉందని తెలిపారు.