ముంబై, జూలై 8: షిండే-బీజేపీ ప్రభుత్వంలో అజిత్ పవార్ వర్గం చేరిక వెనుక పెద్ద కథే ఉన్నదని, సీఎం షిండేకు చెక్ పెట్టేందుకు బీజేపీ అజిత్ను చేరదీసిందనే ప్రచారం నేపథ్యంలో శివసేన(యూబీటీ) నేత అదిత్య ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం షిండే సీటు ప్రమాదంలో ఉన్నదని, ఆయన్ను రాజీనామా చేయమని కోరినట్టు తనకు తెలిసిందని శుక్రవారం వ్యాఖ్యానించారు. ప్రభుత్వంలో త్వరలో మార్పులు ఉండే అవకాశం ఉందన్నారు. త్వరలో రాష్ట్ర క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ జరుగనున్నదనే ప్రచారం నేపథ్యంలో ఆదిత్య వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకొన్నాయి. అజిత్ పవార్ చేరికతో షిండే వర్గంతో పాటు బీజేపీలో కూడా కలవరం మొదలైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
రెండు వర్గాల ఎమ్మెల్యేలకు నోటీసులు
రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకొన్నది. అనర్హత వేటు పిటిషన్లపై సమాధానం చెప్పాలని కోరుతూ 40 మంది షిండే వర్గం శివసేన ఎమ్మెల్యేలకు, 14 మంది ఉద్ధవ్ ఠాక్రే గ్రూపు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చినట్టు స్పీకర్ రాహుల్ నర్వేకర్ శనివారం వెల్లడించారు. స్పందనకు ఏడు రోజుల సమయం ఇచ్చినట్టు తెలిపారు. ఈసీ నుంచి శివసేన రాజ్యాంగం కాపీ అందిందని, సీఎం షిండేతో సహా ఆయన వర్గం 16 మంది ఎమ్మెల్యేలపై ఉన్న అనర్హత పిటిషన్లపై విచారణ త్వరలో ప్రారంభమవుతుందని స్పీకర్ నార్వేకర్ చెప్పిన ఒక రోజు తర్వాత తాజా పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. అనర్హత పిటిషన్లపై త్వరితగతిన విచారణ చేపట్టేలా స్పీకర్కు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ శివసేన(యూబీటీ) గత వారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.