న్యూఢిల్లీ: చంద్రయాన్-3 స్పేస్ క్రాఫ్ట్ చందమామకు మరింత చేరువలోకి వెళ్లింది. మరో మూడు రోజుల్లో ఆ స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడి ఉపరితలంపై దిగనుంది. భారత కాలమానం ప్రకారం ఆగస్టు 23న సాయంత్రం 6.04 గంటలకు చంద్రయాన్-3 మిషన్ చంద్రుడి ఉపరితలంపై దిగుతుందని ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) శాస్త్రవేత్తలు తెలిపారు.
కాగా, ఈ చంద్రయాన్-3 మిషన్ చంద్రుడిపై ల్యాండ్ అయ్యే దృశ్యాలను ఆగస్టు 23న సాయంత్రం 5.27 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ISRO Website https://isro.gov.in, YouTube https://youtube.com/watch?v=DLA_64yz8Ss, Facebook https://facebook.com/ISRO వెబ్సైట్లు, డీడీ నేషనల్ టీవీ ఛానెల్ ద్వారా ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు.
చంద్రయాన్-3 అనేది చంద్రుడిపైకి భారత్ ప్రయోగిస్తున్న మూడో స్పేస్క్రాఫ్ట్. గతంలో రెండు సార్లు ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రుడిపై మూన్ మిషన్లను పంపగా మొదటి ప్రయోగం విజయవంతమైంది. కానీ, రెండో ప్రయోగం విఫలమైంది. ల్యాండింగ్ సమయంలో విక్రమ్ ల్యాండర్ వేగంగా చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టి ధ్వంసమైంది. కాగా, చంద్రయాన్-3 మిషన్ను జూలై 14 ప్రయోగించారు. నలభై రోజుల సుదీర్ఘ ప్రయాణం అనంతరం చంద్రుడిపై దిగేందుకు సిద్ధమైంది.