న్యూఢిల్లీ : చంద్రయాన్ 3 (Chandrayaan-3) సేఫ్ ల్యాండింగ్పై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న నేపధ్యంలో ఈ మిషన్ విజయవంతమవుతుందని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ డైరెక్టర్ అన్నపూర్ణ సుబ్రమణియన్ ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రయాన్ 2 ల్యాండింగ్లో ఎదురైన సమస్యలను గుర్తించి వాటిని చక్కదిద్దడంతో తాజా మిషన్ విజయవంతమవుతుందని ఆమె పేర్కొన్నారు.
చంద్రయాన్-3కి చెందిన ల్యాండర్ విక్రమ్ బుధవారం సాయంత్రం చంద్రుడి ఉపరితలంపై దిగనున్న విషయం తెలిసిందే. చంద్రయాన్ 3 మిషన్ విజయవంతమయ్యేందుకు పలు జాగ్రత్తలు తీసుకున్నారని, విస్తృత పరీక్షలు చేపట్టడంతో పాటు సమస్యలు, లోపాలను గుర్తించి వాటిని పరిష్కరించడం జరిగిందని చెప్పారు. ఈసారి చంద్రయాన్ 3 చంద్రుడి ఉపరితలంలో విజయవంతంగా ల్యాండ్ అవుతుందని సుబ్రమణియన్ ధీమా వ్యక్తం చేశారు. అవసరమైన చర్యలతో పాటు జాగ్రత్తగా అన్ని ఏర్పాట్లనూ చేపట్టిన కారణంగా ఈ మిషన్ జయప్రదమవుతుందని అన్నారు.
రష్యా లూనా-25 మిషన్ విఫలం కావడంతో ఆగస్ట్ 23న చంద్రయాన్-3 ల్యాండింగ్పై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. మరోవైపు చంద్రయాన్-3 ల్యాండింగ్ పై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. ఈ అద్భుత దృశ్యాన్ని తెలంగాణలోని ప్రతీ విద్యార్థి చూడాలని, అందుకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో స్కూళ్లు, కాలేజీలలో లైవ్ స్ట్రీమింగ్ కు ఏర్పాట్లు చేపట్టేందుకు విద్యా శాఖ సంసిద్ధమైంది. కాగా, టీశాట్, నిపుణలో లైవ్ టెలికాస్ట్ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Read More :