న్యూఢిల్లీ: హిమాలయ రాష్ట్రాలైన ఉత్తరాఖండ్ (Uttarakhand), హిమాచల్ప్రదేశ్లు (Himachal Pradesh) భారీ వర్షాలకు (Heavy rains) అతలాకుతమవుతున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో ఆకస్మిక వరదలు (Flash floods), కొడచరియలు (Landslides) విరిగిపడటం వంటి ముప్పు ఎప్పుడేది ముంచుకొస్తుందోనని ప్రజలు దినదినగండంగా గడుపుతున్నారు. ఉత్తరాఖండ్లోని తెహ్రీ జిల్లాలో సోమవారం కురిసిన వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో నలుగురు మృతిచెందారు. వారిలో ఇద్దరు మహిళలు, ఓ నాలుగు నెలల చిన్నారి కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. మరొకరు గల్లంతయ్యారని, వారికోసం గాలింపు చేపట్టామని వెల్లడించారు. చంబా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ట్యాక్సీ స్టాండ్ సమీపంలో కొండచరియ విరిగిపడటంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయని చెప్పారు.
కాగా, రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో పలు జిల్లాల్లో అంగన్వాడీ కేంద్రాలతోపాటు ఒకటి నుంచి 12వ తరగతి వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. డెహ్రాడూన్, పౌరీ, నైనిటాల్, ఛంపావట్, బాగేశ్వర్ జిల్లాలకు వాతావరణ శాఖ (IMD) ఆరెంజ్ అలర్ట్ (Orange alert) ప్రకటించింది.
ఇక హిమాచల్ ప్రదేశ్లో నేటి నుంచి గురువారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. చంబా, మండీ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలను ఆకస్మిక వరదలు ముంచెత్తే అవకాశం ఉందని తెలిపింది. ఆగస్టు 26 వరకు అసాధారణ వర్షపాతం నమోదవుతుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.