మీరెప్పుడైనా రాజస్థాన్కు వెళ్లారా? నిండు వేసవిలో అక్కడ సుమారు 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. అదే విధంగా జమ్ముకశ్మీర్లో శీతాకాలంలో మైనస్ 10 డిగ్రీలు లేదా అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఎముకలు కొరికే చలి ఉండే జమ్ముకశ్మీర్ నుంచి ఠారెత్తించే ఎండలుండే రాజస్థాన్కు సుమారు 600 కిలోమీటర్లు పైనే దూరం ఉంటుంది. కానీ జాబిల్లిపై ఉష్ణోగ్రతల్లో ఈ తేడాలను మీరు గమనించాలంటే ఇంత దూరం పయనించాల్సిన అవసరం లేదు. పట్టుమని 10 సెంటీమీటర్లు చంద్రుడి ఉపరితలాన్ని తవ్వితే చాలు మైనస్ 10 నుంచి 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలను చూడవచ్చు. ఏకకాలంలో చలి, వేసవి కాలాలను దర్శించొచ్చు. జాబిల్లిపై ఇస్రో చేస్తున్న పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. ల్యాండర్లోని చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్పరిమెంట్ (సీహెచ్ఏఎస్టీఈ) పేలోడ్ పంపిన డాటా ఆధారంగా ఇస్రో చంద్రుడి థర్మల్ గ్రాఫ్లను విడుదల చేసింది.
ISRO | బెంగళూరు: జాబిల్లి ఉపరితలంపై సురక్షితంగా దిగిన విక్రమ్ ల్యాండర్ పరిశోధనలను మొదలుపెట్టింది. దక్షిణ ధ్రువ ప్రాంత ఉష్ణోగ్రతలకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఇది ఇస్రోకు చేరవేసింది. ఈ సమాచారాన్ని విశ్లేషించిన ఇస్రో జాబిల్లి ఉపరితల ఉష్ణోగ్రతల్లో చాలా వైరుధ్యం ఉన్నట్టు వెల్లడించింది. జాబిల్లి ఉపరితలం, ఉపరితలానికి సమీపంలో, వివిధ లోతుల్లో ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం ఉన్నట్టు తెలిపింది. ల్యాండర్లోని చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్పరిమెంట్ (సీహెచ్ఏఎస్టీఈ) పేలోడ్ చేసిన పరిశోధనల ఆధారంగా ఇస్రో ఈ విషయాన్ని వెల్లడించింది. సంబంధిత థర్మల్ గ్రాఫ్ను ఇస్రో ఆదివారం విడుదల చేసింది. ‘చంద్రుడి ఉష్ణ ప్రవర్తనపై సీహెచ్ఏఎస్టీఈ పేలోడ్ సాయంతో పరిశోధనలు జరిపాం. జాబిల్లి ఉపరితలం నుంచి 10 సెం.మీ లోతు వరకు పరిశోధనలు జరిపే మెకానిజం ఇందులో ఉంది. ఇందులో ఉండే పది సెన్సార్ల సాయంతో జాబిల్లి దక్షిణ ధ్రువ ప్రాంత ఉష్ణోగ్రతల్లో ఉన్న వైవిధ్యంపై గ్రాఫ్ను రూపొందించాం. మరిన్ని పరిశోధనలు జరుగుతున్నాయి.’ అని ఇస్రో ఎక్స్ వేదికగా తెలిపింది.
గ్రాఫ్ ఆధారంగా విశ్లేషణ…
సీహెచ్ఏఎస్టీఈ పేలోడ్ చేసిన పరిశోధనల ఆధారంగా సేకరించిన సమాచారంపై ఇస్రో మరిన్ని పరిశోధనలు చేస్తున్నది. ఇస్రో షేర్ చేసిన గ్రాఫ్ ఆధారంగా జాబిల్లి లోతుల్లో మైనస్ 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్నట్టు అర్థమవుతున్నది. లోతుల్లో నుంచి ఉపరితలం వైపు పైకి వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కనిపిస్తున్నది. 8 సెంటీమీటర్ల లోతులో మైనస్ 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్నట్టు ఈ గ్రాఫ్ తెలుపుతున్నది. అదే సమయంలో ఉపరితలంపై 50-60 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్నట్టు గ్రాఫ్లో కనిపిస్తున్నది. చంద్రుడి ఉపరితలం, లోతుల్లో ఉష్ణోగ్రతల్లో ఉన్న వైవిధ్యాన్ని ఇది స్పష్టంగా తెలియజేస్తున్నది.
మార్స్, శుక్రుడిపైకి వెళ్లే
పెట్టుబడులు ఉండాలే గానీ చంద్రుడు, అంగారకుడు, శుక్రుడిపైకి కూడా వెళ్లగలిగే సత్తా భారత్కు ఉందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ ఎస్ సోమనాథ్ ధీమా వ్యక్తం చేశారు. అయితే పెట్టుబడులే అసలు సమస్య అని ఆయన పేర్కొన్నారు. తిరువనంతపురంలో ఆదివారం ఆయన మాట్లాడారు. ‘చంద్రుడు, అంగారకుడు, శుక్రుడిపైకి వెళ్లే సత్తా భారత్కు ఉంది. అందుకు దేశంలో అంతరిక్ష రంగంలో భారీగా పెట్టుబడులు పెరగాలి. ముందుగా ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. అంతరిక్ష రంగం మరింతగా అభివృద్ధి చెందాలి. తద్వారా దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. అదే మా లక్ష్యం’ అని ఆయన తెలిపారు.