న్యూఢిల్లీ, జనవరి 16 (నమస్తే తెలంగాణ): ఒక చట్టానికి సవరణ జరిగితే.. అంతకుముందు జరిగిన నేరాలకు ఈ సవరణల నిబంధనల కింద కేసు నమోదు చేయవచ్చా? లేక ఆ సవరణలకు ముందున్న పాత చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలా? ఈ న్యాయ మీమాంసపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు రెండు భిన్నమైన తీర్పులు వెలువరించారు. టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేసే విషయంలో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్నమైన తీర్పును వెలువరించింది.
ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు తమ మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని విస్తృత ధర్మాసనానికి నివేదించాలని నిర్ణయించారు. ఈ కేసులో అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ చంద్రబాబుకు వర్తిసుందా లేదా అన్న దానిపై జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదీల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సెక్షన్ 17ఏ ప్రకారం ఓ ప్రజా ప్రతినిధి లేదా ఉన్నతస్థానంలోని ప్రభుత్వ ఉద్యోగి తన విధి నిర్వహణలో అక్రమాలకు పాల్పడితే వారిపై చట్టపరమైన చర్య తీసుకొనే ముందు వారి పై అధికారి నుంచి తప్పనిసరిగా అనుమతి పొందాలి.
ఇద్దరు జడ్జీలలో సీనియర్ అయిన జస్టిస్ బోస్ మాట్లాడుతూ.. ‘ఈ కేసులో సెక్షన్ 17ఏను వర్తింపచేసే విషయంలో మాకు భిన్నాభిప్రాయాలున్నందున సరైన నిర్ణయం తీసుకొనేందుకు ఈ అంశాన్ని చీఫ్ జస్టిస్ ముందుంచుతున్నాం’ అని చెప్పారు. ఈ కేసును వేర్వేరు తీర్పులు చెప్పిన ఆ ఇద్దరు న్యాయమూర్తులు లేని ఫుల్ బెంచ్కి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నివేదించనున్నారు. చంద్రబాబును రిమాండ్కు పంపు తూ సీఐడీ మేజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పును, ఆయనపై దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ద్విసభ్య ధర్మాసనం సమర్థించింది.
గవర్నర్ అనుమతి అనవసరం
జస్టిస్ బేలా త్రివేది తన తీర్పులో.. అవినీతి నిరోధక చట్టాన్ని సవరించడానికి (2018 జూలైకి ముందు) జరిగిన నేరాలకు సవరణ చట్టంలోని సెక్షన్ 17ఏ వర్తించదని పేర్కొన్నారు. చంద్రబాబు కేసులో గవర్నర్ అనుమతి పొందాల్సిన అవసరం లేదన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో ఐపీసీ, పీసీ చట్టం.. రెండింటి ప్రకారం విచారణ చేయవచ్చని చెప్పారు. చంద్రబాబుపై ఐపీసీ సెక్షన్ల కింద కూడా నేరాభియోగాలు నమోదైన ఈ కేసులో కేవలం సెక్షన్ 17ఏ కింద అనుమతులు పొందలేదన్న నెపంతో ఎఫ్ఐఆర్ను కొట్టివేయలేమని తేల్చి చెప్పారు.
2018లో చట్ట సవరణ చేయడానికి ముందే స్కిల్ డెవలప్మెంట్ స్కాం జరిగిందన్నారు. ‘కేసును కొట్టేయాలన్న చంద్రబాబు పిటిషన్ను ఆమోదించలేం. చట్టం రాకముందు కాలానికి దీన్ని వర్తింపజేస్తే సరికొత్త వివాదాలకు తెరలేపినట్టు అవుతుంది’ అని అన్నారు. ఏపీ సీఐడీ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో అవినీతి 2014-2016 మధ్య జరిగిందని, బాబుపై ఎఫ్ఐఆర్కు, విచారణకు గవర్నర్ అనుమతి అవసరం లేదని చెప్పారు.
గవర్నర్ అనుమతి పొందాల్సిందే
గత ఏడాది సెప్టెంబర్ 22న క్వాష్ పిటిషన్ను కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ ముగించిన ద్విసభ్య ధర్మాసనం అక్టోబర్ 17న తీర్పును రిజర్వులో ఉంచింది. జస్టిస్ అనిరుద్ధ బోస్ మంగళవారం తన తీర్పును వెలువరిస్తూ.. ‘సెక్షన్ 17ఏ ప్రకారం చంద్రబాబుపై దాఖలైన కేసులో పోలీసులు గవర్నర్ అనుమతి తీసుకోవాలి. అనుమతి లేకుండా కేసు నమోదు/దర్యాప్తు చెల్లదు. ఏపీ సీఐడీ చర్యలు చట్టవిరుద్ధం’ అని పేర్కొన్నారు.
చంద్రబాబును అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(1)సీ, డీ, 13(2) ప్రకారం విచారణ చేయడానికి వీలులేదు అని అన్నారు. ఇప్పుడైనా సరే సంబంధత అధికారి నుంచి ఆ అనుమతి పొందవచ్చు అని అన్నారు. అవినీతి నిరోధక చట్టానికి 2018 జూలైలో చేసిన సవరణ ప్రకారం.. ప్రజా ప్రతినిధి లేదా అధికారి తాను తీసుకున్న నిర్ణయం ద్వారా ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించినా లేక అవినీతికి పాల్పడినా వారిపై దర్యాపు, విచారణ చేప ట్టే ముందు పైఅధికారి నుంచి అనుమతి పొందాలి’ అని స్పష్టం చేశారు.