Chandigarh Court | చండీగఢ్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు వచ్చింది. దాంతో భద్రతా బలగాలు కోర్టులను ఖాళీ చేయించారు. కాంప్లెక్స్లోని అన్ని భవనాల్లో సెర్చ్ కొనసాగుతున్నది. దీంతో పంచకుల కోర్టుతోపాటు పంజాబ్-హర్యానా హైకోర్టులో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు.
బాంబు సమాచారం చండీగఢ్ జిల్లా కోర్టులో కలకలం సృష్టించింది. చండీగఢ్ సెక్టార్ 43 లోని జ్యుడీషియల్ కాంప్లెక్స్లో బాంబు పెట్టినట్లు పోలీసులకు ఒక లేఖ అందింది. కారులో బాంబు ఉన్నదని, తెల్లవారుజామున 1 గంటకు పేలుతుందని ఆ లేఖలో పేర్కొన్నారు. దీంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని జడ్జీలు, న్యాయవాదులు, కోర్టు సిబ్బందిని బయటకు పంపించారు. అనంతరం కోర్ట్ కాంప్లెక్స్ మొత్తాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు. ఆపరేషన్ సెల్, డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టీమ్, రిజర్వ్ ఫోర్స్ కమాండోలు కోర్టుకు చేరుకుని బాంబు కోసం గాలిస్తున్నారు.
సెక్టార్-43లో పోలీసు సెర్చ్ ఆపరేషన్ జరుగుతున్న ప్రదేశానికి చండీగఢ్ బస్టాండ్ సమీపంలోనే ఉన్నది. అక్కడ కూడా పోలీసులు సోదాలు జరుపుతున్నారు. చండీగఢ్ జిల్లా కోర్టుతో పాటు పంచకుల కోర్టుకు కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. అక్కడ కూడా లాయర్లు, సిబ్బంది, ఇతర వ్యక్తులను బయటకు పంపించి పోలీసులు సోదాలు చేస్తున్నారు. మరోవైపు పంజాబ్, హర్యానా హైకోర్టులోనూ పోలీసు భద్రతను పెంచారు. అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు.