Chandigarh: చండీగఢ్ మున్సిపల్ కార్పోరేషన్ సీనియర్ డిప్యూటీ మేయర్ పీఠం బీజేపీకి దక్కింది. బీజేపీ కౌన్సిలర్ కుల్జీత్ సింగ్ సంధూ చండీగఢ్ సీనియర్ డిప్యూటీ మేయర్గా ఎంపికయ్యారు. మున్సిపల్ కార్పోరేషన్లోని మొత్తం 35 మంది కౌన్సిలర్లకుగాను 19 మంది బీజేపీ అభ్యర్థి కుల్జీత్సింగ్ సంధూకు, 16 మంది కాంగ్రెస్-ఆప్ కూటమి అభ్యర్థి గుర్ప్రీత్ గాబీకి ఓటేశారు.
దాంతో కుల్జీత్సింగ్ సంధూ చండీగఢ్ సీనియర్ డిప్యూటీ మేయర్గా ఎన్నికైనట్లు ప్రకటించారు. అనంతరం చండీగఢ్ డిప్యూటీ మేయర్ పదవి కోసం ఎన్నికల ప్రక్రియను ప్రారంభించారు. కాగా, చండీగఢ్ మున్సిపల్ కార్పోరేషన్లోని 35 మంది కౌన్సిలర్లలో బీజేపీ కౌన్సిలర్లు 17 మంది, ఆప్ కౌన్సిలర్లు 10 మంది, కాంగ్రెస్ కౌన్సిలర్లు 7 మంది ఉన్నారు. బీజేపీ మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ (SAD) పార్టీ నుంచి ఒక కౌన్సిలర్ కార్పోరేషన్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఇవాళ జరిగిన ఓటింగ్లో కుల్జీత్ సింగ్ సంధూకు బీజేపీకి చెందిన 17 మంది కౌన్సిలర్లు, ఎస్ఏడీ కౌన్సిలర్, ఎక్స్ అఫిషియో మెంబర్ హోదాలో స్థానిక ఎంపీ కిరణ్ ఖేర్ ఓటేశారు. కాంగ్రెస్, ఆప్కు చెందిన 17 మందిలో 16 ఓట్లు మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చాయి. మరో ఓటు చెల్లుబాటు కాలేదు. కాగా, ప్రస్తుత మేయర్, ఆప్ కౌన్సిలర్ కుల్దీప్ కుమార్ ఆధ్వర్యంలో సీనియర్ డిప్యూటీ మేయర్ ఎన్నికల జరిగింది.